Sunday, October 21, 2012

మానవత్వానికి మతం లేదు

- దేవుడిపై నమ్మకం నా వ్యక్తిగతం 
- దయచేసి దీనిపై చర్చలు ఆపండి: విజయమ్మ 

 ‘నా భర్త చనిపోయారు. నా కుమారుడు జైల్లో ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో నేను నిలబడగలిగే ధైర్యం తెచ్చుకునేందుకే బైబిల్ పట్టుకుంటున్నా..’ అని వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తెలిపారు. దయచేసి ఈ అంశంపై చర్చలు ఆపాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఉదయం పులివెందులలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘రాజకీయ నాయకులకు, పీఠాధిపతులకు, మీడియాకు ఒకటే విజ్ఞప్తి. నేను చేతిలో పట్టుకునే బైబిల్ గురించి చర్చలు పెడుతున్నారు. దేవుడిపై నమ్మకం నా వ్యక్తిగతం. అది రాజ్యాంగం కల్పించిన హక్కు. దానిపై పదే పదే చర్చలు ఎందుకు పెడుతున్నారో నాకైతే అర్థం కావడం లేదు. నేనేమైనా ప్రచారం చేస్తున్నానా? నా భర్త చనిపోయిన తర్వాత ధైర్యం కోసం బైబిల్ పట్టుకుంటున్నాను. అది నాకు ధైర్యాన్నిచ్చే అంశం. నాకొక ఓదార్పునిచ్చే అంశం. 

అందుకే అసెంబ్లీకి వెళ్లినా.. ఎక్కడికి వెళ్లినా పట్టుకుంటున్నా. నా భర్త చనిపోయాక, నా కొడుకును జైల్లో పెట్టాక నాకదే తోడైంది. అయితే నేను అన్ని మతాలను గౌరవిస్తా. ఏ పూజలో అయినా పాల్గొంటా. మసీదుకైనా వెళతా. మానవత్వానికి మతం లేదు. అందరి రక్తం ఒక్కటే. మనుషులను ప్రేమించడం ఒక్కటే రాజశేఖరరెడ్డి మాకు నేర్పించారు. ఆయన ఎవరికీ అన్యాయం చేయలేదు. మానవత్వానికి విలువ ఇచ్చారు. అందుకే ఆయన కోసం 700 ప్రాణత్యాగాలు జరిగాయి. స్వాతంత్య్రం వచ్చాక ఏ ముఖ్యమంత్రి కూడా చేయని రీతిలో దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాలకు నిధులు ఇచ్చారు. అర్చకుల కుటుంబాలు ఇబ్బందుల్లో ఉండకూడదని వారికి జీతాలు ఇచ్చే ఏర్పాటు చేశారు. ముస్లిం సోదరులకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించారు..’ అని విజయమ్మ గుర్తుచేశారు. 

అమ్మ వాళ్లింట్లో అఖండ దీపం 
‘మా అమ్మవాళ్లది చాలా సనాతన, సంప్రదాయక కుటుంబం. ప్రస్తుత కలికాలంలో కూడా వారింట్లో అఖండదీపం వెలుగుతూనే ఉంటుంది. 24 గంటలూ వెలుగుతుంది. స్వాములు వచ్చినా వారింట్లోనే ఆతిథ్యం స్వీకరిస్తారు. చిన్నప్పటి నుంచి నాన్న మాకు నేర్పించింది అందరినీ గౌరవించడమే. తిరుపతిలో జగన్ బాబు ఆలయానికి వెళ్లినప్పుడు కూడా పెద్ద వివాదం చేశారు. కానీ మానవత్వం మా మతం. నా దేవుడిని నమ్మండి అని నేను చెప్పడం లేదు. దీని గురించి ఏ చర్చా అవసరం లేదు. రాష్ట్ర ప్రజలకు, పీఠాధిపతులకు ఇదే నా విజ్ఞప్తి. ఈరోజు ఓ చానల్‌లో ఏకంగా నేను బైబిల్ పట్టుకునే అంశంపై చర్చ పెట్టి పీఠాధిపతులను పిలిచారు. నా భర్త చనిపోయారు. నా కుమారుడు జైల్లో ఉన్నాడు. అందుకే ధైర్యం కోసం బైబిల్ పట్టుకుంటున్నా. దయచేసి దీనిపై ఇంతటితో చర్చలు ఆపండి..’ అని విజయమ్మ విజ్ఞప్తి చేశారు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...