Monday, December 17, 2012

Sharmila's innerviw

Special interview with Pryadarshini Ram....
మానవ సంబంధాలు తెలుసుకోవడానికి పుస్తకాలే చదవక్కర్లేదు...
విలువల వెల్లువ పవిత్ర గ్రంథాల్లోనే వెతకక్కర్లేదు...
మాటకోసం ముళ్లబాట పురాణాలలోనే, మహాకావ్యాల్లోనే తరించక్కర్లేదు...
ఏ మానవుడైతే ధర్మాన్ని... సత్యాన్ని...
ఉచ్ఛ్వాస నిశ్వాసగా నమ్మి జీవిస్తాడో...
తానే ఒక మానవ సంబంధాల పుస్తకం, తనే ఒక విలువల గ్రంథం, తనే ఒక మహాకావ్యం!
150 ఎమ్మెల్యేల సంతకాలు ‘నిజం’.
అవి కాదని ప్రజలకోసం పోరాడడం ‘ధర్మం’.
అదే నిజం, అదే ధర్మం సంకెళ్లయితే ఏమవుతుంది?
అదే విలువల పోరాటం చెరసాలను బహుమతిగా ఇస్తే ఏమవుతుంది?
నిజాన్ని, ధర్మాన్ని, ఇచ్చిన మాటను, ఊపిరిపోసుకున్న మానవత్వాన్ని
ప్రతిరోజూ శిలువేస్తుంటే ఏమవుతుంది?
రాజకీయాల్లో మానవత్వం చనిపోతే ఏమవుతుంది?
మరో ప్రజాప్రస్థానం అవుతుంది!
ఓ ప్రజాదేవుని మడమ తిప్పని బాట అవుతుంది...
ఓ ప్రజాభక్తుడి మాట తప్పని బాణం అవుతుంది!
ప్రతి పేద హృదయంలో విలువల పెన్నిధి ఉందని గుర్తిస్తుంది...
గుర్తు తెచ్చుకుంటుంది... వైయస్ షర్మిల!


- ప్రియదర్శిని రామ్

రామ్: మీ తండ్రిగారి సమాధి దగ్గర ప్రార్ధనతో మరో ప్రజాప్రస్థానం మొదలుపెట్టారు. నాన్నతో మీరేం చెప్పారు? నాన్న మీకేం చెప్పారు?
షర్మిల: ఆరోజు పొద్దునే వెళ్లి నాన్న దగ్గర కూర్చుని ‘‘నాన్నా నువ్వెళ్లిపోయి మూడు సంవత్సరాలు అయిపోయింది. ఈ మూడు సంవత్సరాలలో ఈ కుటుంబం ఎన్ని కష్టాలు అనుభవించిందీ... ఈరోజు వరకూ కూడా అన్న ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నాడు...’’ అని జ్ఞాపకం చేసుకున్నా. ఈ మూడు సంవత్సరాలలో పడిన కష్టాల ముందు ఈ మూడువేల కిలోమీటర్లు నాకు ఎక్కువ అనిపించలేదు. కష్టం అనిపించలేదు. ‘‘ఈ రోజు అమాయకుడు అన్న.. నిర్దోషి అయినా జైలులో ఉన్నాడు... దేవా నువ్వు జోసెఫ్‌తో చెరసాలలో ఎలా తోడై ఉన్నావో అన్నతో కూడా నువ్వు తోడుగా ఉన్నావని నేను నమ్ముతున్నాను... ఎలాగైతే నువ్వు జోసెఫ్‌ను ఒక అద్భుతం చేసి జైలు నుంచి తీసుకొచ్చి రాజును చేశావో అలాగే అన్నను చెరసాల నుంచి తీసుకొచ్చి రాజును చేసి ప్రజల సేవ కోసం తప్పకుండా వాడుకుంటావని పూర్తి నమ్మకం ఉంది దేవా’’ అని నేను దేవునికి చెప్పాను. ‘‘నా విశ్వాసమిది. నువ్వు చేస్తావని నువ్విచ్చే ధైర్యంతో వెళ్తున్నాను దేవా’’ అని నాన్నకి, దేవునికి చెప్పి బయల్దేరాను.

రామ్: ఇంత సుదీర్ఘమైన ప్రయాణం... 3వేల కిలోమీటర్లు.. మీ బంధువులు గానీ, స్నేహితులు గానీ ఎవరూ వారించలేదా - ‘చాలా కష్టం తల్లీ.. నువ్వు చేయలేవు.. మానుకో.. పెద్ద తపస్సు అవుతుంది’ అని!
షర్మిల: చెప్పారు. నా మంచి కోరే చాలా చెప్పారు - ‘ఇది చాలా కష్టమమ్మా నీకర్థం కావడం లేదు. బస్సు యాత్ర అయితే సులభంగా ఉండేది నీకు ఇది చాలా కష్టం మళ్లీ ఆలోచన చేసుకో’ అని! కానీ జగనన్న ఈ పాదయాత్ర చేయాలనుకోవడానికి వెనక ఉన్న ఉద్దేశం చాలా గొప్పదని అనిపించింది. ఈరోజు ప్రజలు పడుతున్న కష్టానికి మనం వెళ్లి వారికి ధైర్యం చెప్పి ‘‘ఓపిగ్గా ఉండండి.. రాజన్న రాజ్యం మళ్లీ వస్తుంది.. మీరు నా కుటుంబం... రాజన్న ఎలాగైతే తన బాధ్యతను తాను తీసుకున్నాడో నేను మీ కోసం నిలబడతాను... మీరు నాకు నాన్న ఇచ్చిన కుటుంబం... నేను మీ పక్షాన ఉన్నాను... మీ కష్టాల్లో నేను మీ కోసం పోరాడతాను’’ అని జగనన్న ఈ పాదయాత్ర తనే చేయాలనుకున్నాడు. ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ప్రజలకు నమ్మకం, ధైర్యం, నిరీక్షణ ఇవ్వడం.. నాన్న ఓ చిన్న చిట్కా చెప్పేవాడు.. ఏదైనా ఒక పెద్ద సమస్య మన ముందు ఉంటే ఆ సమస్యని ఒక్క పెద్ద సమస్యగా చూడకుండా దాన్ని చిన్నచిన్న ముక్కలు చేసి పరిష్కరిస్తే చాలా సులువవుతుంది అని! దానినే నేను వారికి చెప్పాను.. నేను మూడువేల కిలోమీటర్లు ఒక్కరోజులో నడవడం లేదు కదా... రోజుకు ఓ పదిహేనో, పద్దెనిమిది కిలోమీటర్లో నడుస్తా... నాన్న పాదయాత్రను తల్చుకుని వారు భయపడ్డారు. నాన్న పాదయాత్ర నిజంగానే కష్టంగా ఉండింది. ఎందుకంటే అప్పుడు మండే ఎండలు. చాలా కష్టపడ్డాడు నాన్న.. అందులో నాన్న రోజుకు 25 కిలోమీటర్లు.. 27 కిలోమీటర్లు కూడా నడిచాడు. నాన్న పడిన కష్టం తలుచుకుని వాళ్లు నాకోసం చాలా బాధపడ్డారు. నాన్న బ్రతికుంటే.. అన్న బైట ఉంటే... ఈ పాదయాత్ర కచ్చితంగా నాచేత చేయించేవాళ్లు కాదు. వద్దని చెప్పేవారు. కానీ నేను ముందుగానే చెప్పినట్లు ఉద్దేశం ముఖ్యమైంది కనుక, పోవాల్సిన అవసరం ఉంది కనుక, ఇది చేయాల్సిన అవసరం ఉంది కనుక ముందుకెళ్లడానికి వారు నన్ను అనుమతించారు. 

రామ్: మీ మాటల్లో మీ నాన్న ప్రేమ చాలా కనబడుతుంటుంది. మీరు, మీ బాల్యంలో మీ నాన్నతో పంచుకున్న అందమైన స్మృతులేమైనా ఉన్నాయా?
షర్మిల: చాలా ఉన్నాయి. కానీ అతి ముఖ్యమైన అంశం ఏమిటంటే ఆయన ప్రేమ. నేను ఆయన డార్లింగ్‌ని. నన్ను చిన్నప్పుడు తన దగ్గర కూర్చోబెట్టుకుని లెక్కపెట్టి వంద ముద్దులు పెట్టించుకునేవారు. నన్ను చాలా ఆప్యాయంగా, చాలా గారాబంగా చూసుకునేవారు. బాల్యమే కాదు, కడవరకూ... నాన్న నన్ను ఎప్పుడు చూసినా తన గుండెల్లోంచి నవ్వు పుట్టుకొచ్చేది. చిరునవ్వు నవ్వి చెయ్యి చాపేవారు ‘రా బిడ్డా’ అని. నేను దగ్గరకు రాగానే నా బుగ్గమీద ముద్దు పెట్టేవారు. చాలా మంచిగా అనిపించేది. 

రామ్: చివరి రోజుల్లో ఏదైనా ముఖ్యమైన సంఘటన ఉందా?
షర్మిల: నేను నాన్నను చివరిగా చూసిన రోజు అది...నాన్న దగ్గర ఉన్నాం. పిల్లలకు కూడా ఏవో సెలవులున్నట్లున్నాయి. పిల్లలు, మేము అందరం ఉన్నాం. రాత్రి నాన్న ఆఫీసు నుంచి వచ్చిన తర్వాత స్నానం చేశాక కాసేపన్నా కలసి కూర్చుంటాం. ఆ రోజు రాత్రి కూడా అందరం కలసి కూర్చున్నాం. సాధారణంగా నేను నాన్న ఉన్న గదిలోకి వెళ్లగానే ఆయనకు ముద్దుపెట్టి కూర్చుంటా. ఆరోజు ఏదో ఫోన్‌లో మాట్లాడుతున్నట్లున్నా. మాట్లాడు కుంటూ నాన్నను దాటి పోయి వెళ్లి కూర్చున్నా. ఫోన్ మాట్లాడడం అయిపోయింది. నాన్న నా వంక చూసి చేయి చాపాడు. అప్పుడు గుర్తొచ్చింది నాకు. లేచి ఆయనవైపు వెళుతుంటే.. ‘మరచిపోతే ఎలా..’ అని అన్నారు. నేను దగ్గరకు వెళ్లగానే నాకు ముద్దుపెట్టారు. 

రామ్: అదే ఆఖరుసారి మీరు నాన్నతో ఉన్న రోజు..?
షర్మిల: అవును అదే ఆఖరు. 

రామ్: బాల్యం అంతా నాన్నేనా? అన్నయ్య కూడా ఉన్నాడా?
షర్మిల: ఉన్నారండి... ఎందుకు లేరు? అన్నయ్య చిన్నప్పటి నుంచి నాకొక హీరో. చిన్నప్పుడంతా అన్నయ్య వెనకే తిరిగేదాన్ని. అన్న సైకిల్‌పై వెళితే నేనూ వెళ్లాలనేదాన్ని. నీతో వస్తా.. నీతో వస్తా అని వెంటపడేదాన్ని. అన్నయ్య ఫ్రెండ్స్‌తో ఆడుకోవడానికి వెళ్తుంటే నేనూ వస్తా అనేదాన్ని. ఆయనకు విసుగొచ్చేంత వరకూ అనేదాన్ని. చిన్నపుడు నేను స్లీవ్‌లెస్ వేసుకుంటే నచ్చేది కాదు. ఆయన పద్ధతిగా ఉండేవాడు.. నేనూ పద్ధతిగా ఉండాలనుకునేవాడు. కొంచెం పెద్దయ్యాక స్కూలు, హైస్కూలు, కాలేజీ.. నేనెప్పుడన్నా ఎస్సేలు రాయాలంటే నాకు సహాయపడేవాడు. పరీక్షలు రాయడానికి తనే తీసుకెళ్లేవాడు. చాలా బాధ్యతగా, రక్షణగా ఉండేవాడు. ఇప్పటికి కూడా చాలా బాధ్యతగా మెలగుతాడు. అన్నయ్యకు ఇద్దరు కూతుర్లు. నన్ను తన పెద్ద కూతురుగా చూసుకునేంత పెద్ద మనసుంది. 

రామ్: అంత బాధ్యతగా చూసుకున్న అన్నయ్య.. మీరు ప్రజాప్రస్థానానికి వెళ్తానన్నపుడు ఎలా ఫీలయ్యాడు? నిజానికి సుప్రీంకోర్టు తీర్పు వచ్చినపుడు మీరు, మీ వదినగారు భారతమ్మ ఇద్దరూ జగన్‌తోపాటు ఉన్నారు. అక్కడేం జరిగింది? 
షర్మిల: సుప్రీంకోర్టులో అన్నకు బెయిల్ వస్తుందని అందరం నమ్మాం. నాన్న ఎలాగైతే పాదయాత్ర చేసి ప్రజలకు ధైర్యం చెప్పాడో.. మంచిరోజులొస్తాయని చెప్పాడో.. అదే విధంగా.. అన్న కూడా చేయాలను కున్నాడు. రైతులు, ముఖ్యంగా విద్యార్థులు చాలా కష్టపడుతున్నారు. వారికి చెప్పాల్సిన అవసరముంది. మంచికాలం వస్తుంది, ఓపికపట్టండి అని! అందుకోసమే పాదయాత్ర చేయాలనుకున్నాడు. అందుకోసం రూట్‌మ్యాప్ కూడా తయారు చేసుకున్నాడు. బెయిల్ వస్తుందనే అనుకున్నాం. అందుకే తీర్పు వచ్చే సమయానికి అన్న దగ్గర ఉండేవిధంగా ఏర్పాట్లు చేసుకుని వెళ్లాం. కొంచెం సేపటికి జడ్జిమెంట్ వచ్చింది. కానీ వ్యతిరేకంగా వచ్చింది. అందరం బాగా నిరాశపడ్డాం. కానీ క్షణాల్లోనే అన్న తేరుకుని ధైర్యంగా ఉండండి అని చెప్పాడు. అప్పుడు నేను అన్నతో - ‘అన్నా ఇంతమందిమి ఉన్నాం.. కానీ నువ్వు ఒక్కడివి అయిపోయావు.. ఇక్కడ ఒంటరిగా ఉంటున్నావు. మేమందరం బైట ఉన్నాం. నువ్వొక్కడివే కష్టాలు పడుతున్నావు. మేమేం చేయలేమా? నేనేం చేయలేనా? మనస్ఫూర్తిగా చెబుతున్నా.. నీ కోసం నేనేమైనా చేస్తాను. నా ప్రాణాలైనా ఇస్తానన్నా... చాలా బాధగా ఉంది. నువ్విక్కడుంటే’ అన్నాను. అన్న నా తలమీద చేయిపెట్టి నవ్వాడు. అప్పుడే పుట్టింది ‘మరో ప్రజాప్రస్థానం’.

రామ్:మీరు, భారతిగారు ఇలా బాధపడుతున్నపుడు... జగన్‌కి బాధ లేదా బెయిల్ రాలేదని?
షర్మిల: బెయిల్ రాలేదన్న బాధకంటే తన ముఖంలో స్పష్టంగా తాను పాదయాత్ర చేయలేకపోతున్నాడు అన్న బాధ ఎక్కువగా కనిపించింది. ‘తనకు ప్రజల మధ్యకు వెళ్లాలన్న తపన ఎంతగా ఉందో.. అది చేయలేకపోతున్నానని లోపల ఎంత మధనపడుతున్నాడో’ అని చాలా బాధేస్తున్నది.

రామ్: పాదయాత్ర మీ నాన్నలో మార్పు తెచ్చిందంటారు.... ఓదార్పు యాత్ర జగన్‌ను బాగా మార్చిందంటారు. మరో ప్రజా ప్రస్థానం మిమ్మల్నెలా మార్చింది? 
షర్మిల: ఈ పాదయాత్రలో ఎన్నో సంఘటనలు... ఒక అవ్వ వచ్చి ‘‘అమ్మా నా భర్తకి పెన్షన్ వచ్చేది. చంద్రబాబు నాయుడు ఉన్నపుడు 75 రూపాయలొచ్చేది... మీ నాయనొచ్చి 200 రూపాయలు చేశాడమ్మా.. బానే ఉంది కానీ ఖర్చులు చాలా పెరిగిపోయాయి. బతకడం చాలా కష్టమైపోయింది... నాక్కూడా పెన్షన్ కావాలి అని అధికారులను అడిగాను. నీ భర్త చనిపోయాక నీకిస్తాం అన్నారు’’ అని చెప్పింది. ఒక భార్యతో తన భర్త గురించి అంత చులకనగా మాట్లాడడం మన సాంప్రదాయంలో లేదు. అది చాలా బాధాకరం. అంటే తనకు పెన్షన్ రావాలంటే తన భర్త చనిపో వాలని ఆమె కోరుకోవాలన్నమాట. అంత దారుణమైన పరిస్థితులున్నాయి ఈరోజు రాష్ర్టంలో. అంత పేదరికంలో బతుకుతున్నారు ఈరోజు మహిళలు. తల్లికి తన బిడ్డలను చదివించుకోవాలని చాలా ఆశగా ఉంటుంది. కానీ ఈరోజు తల్లులు బిడ్డలను స్కూలుకు పంపించడం కంటే కూలీకి తీసుకెళ్తే కూలి డబ్బులొస్తాయి. ఆ డబ్బులు రాకపోతే మూడు పూట్లా తినే పరిస్థితి లేదని పిల్లలను స్కూలుకు కూడా పోనీయకుండా కూలికి తీసుకెళ్తున్నారు. వారికిష్టమై కాదు. వారిని స్కూలుకు పంపించాలనే ఉంటుంది మనసులో... కానీ వాళ్లను కూడా తీసుకెళ్లకపోతే డబ్బులు రావు. అన్ని ధరలూ పెరిగిపోయాయి. మూడింతలు, నాల్గింతలు.. ఏది చూసినా ధరలు మండిపోతున్నాయి. చాలా బాధేస్తుంది. ఓ చిన్నబాబు.. పన్నెండే ళ్లుంటాయి.. అమ్మ లేదు. వాళ్ల నాన్న ఆరోగ్యం బాగోలేదు. మంచాన ఉన్నాడు. దాంతో గొర్రెలను కాచుకోవడానికి ఆ పిల్లాడు వచ్చాడు. ‘ఇంత బాధ్యత ఈ చిన్న పిల్లాడు మోస్తున్నాడా’ అని ఆశ్చర్యమేసింది. ‘ఏం నాన్నా నీకు చదువుకోవాలని లేదా.. స్కూలుకెళ్లాలని లేదా..’ అని అడిగితే ఆ అబ్బాయికి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ‘నాకు ఇష్టమక్కా స్కూలు. కానీ జీవాలను చూసుకోవాలి కదా? నాన్నకి బాగోలేదు కదా’ అన్నాడు. చాలా బాధేసింది. మనసును పిండేసినట్లయిపోయింది. ఇంకోసారి... అస్రీన్ అని ఒక అమ్మాయి.. డిస్టింక్షన్‌లో పాసయ్యింది. బీ ఫార్మసీ చేయాలని ఆమె కోరుకుంది. నా దగ్గరకు వచ్చింది.. కన్నీళ్లు పెట్టుకుంది. ‘నాకు బీ ఫార్మసీ చేయాలనుందక్కా... కానీ మానాన్న బీదోడు.... నన్ను చదివించలేనని అంటున్నాడు... నాకు ప్రభుత్వం ఏమీ చేయడం లేదు... రాజన్న ఉంటే తప్పకుండా అయిపోయేది.. ఇపుడు నా పరిస్థితి ఏమిటి?’ అని అడిగింది. చాలా బాధేసింది. నిజంగానే నాన్న ఉంటే ఆ పాప కోరిక తీరిపోయేది. ఎంతోమంది పిల్లలు ఈరోజు డ్రాపవుట్స్‌గా మారి ఇంటిదగ్గర కూర్చుంటు న్నారు. లేదంటే కూలిపనికి వెళుతున్నారు. ఇదీ దుస్థితి. నా పాదయాత్ర నాకు ప్రజల జీవితాల విలువ తెలియజెప్పింది. ప్రజల జీవితావసరాల విలువ తెలియజెప్పింది. వాళ్ల అవసరాలను తీర్చడం ఎంత ముఖ్యమో అన్నది స్పష్టంగా కనిపించింది. అలా తీర్చగలిగాడు నాన్న. మళ్లీ అలా కావాలి అంటే అన్న రావాలి. ఆ ఆశ ఉంది.. ఆ రోజు వస్తుంది అని చెప్పడం నా కర్తవ్యంగా మారిపోయింది. ఇంకో విషయం కూడా నాకు చాలా బాగా గుర్తుంది. దస్తగిరి అని ఓ రైతు. తను తన భార్య. పంట వేశాడు. ‘పోయిన సంవత్సరం నాకు లక్షా డెబ్బయివేలు నష్టం వచ్చింది. ఈ సంవత్సరం పంట వేశాం. ఈ సంవత్సరం కూడా ఏమీ లాభం వచ్చేట్లు లేదు. నష్టమే వచ్చేట్లుందమ్మా’అని బాధపడ్డాడు. ‘అప్పులెన్నున్నాయన్నా’ అని నేనడిగా. మూడు లక్షలు అప్పు ఉందని చెప్పాడు. ధైర్యంగా ఉండన్నా అనగానే.. ‘లేదమ్మా ఇక చేనన్నా అమ్మేసుకోవాలి... లేకపోతే పురుగుల మందన్నా తాగాలి... నాకింకో దారిలేదమ్మా’ అన్నాడు. ‘లేదన్నా మంచి కాలం వస్తుంది. మీరు కొంచెం ఓపికపట్టండి.. మీ ప్రాణాలు చాలా విలువైనవి.. మీ చేలు కూడా విలువైనవి అమ్ముకోవద్దు, కొంచెం ఓపిక పట్టండన్నా.. జగనన్న వస్తాడు. మళ్లీ రైతు రాజవుతాడు... తప్పకుండా నాన్న మీ పక్షాన ఎలా నిలబడ్డాడో జగనన్న కూడా నిలబడతాడన్నా’ అని నేనెంత ఒప్పించడానికి ప్రయత్నించినా వారు వినే పరిస్థితిలో లేరు. ‘జగనన్న తప్పకుండా వస్తాడమ్మా.. అంతవరకూ తినడానికి తిండైనా ఉండాలి కదమ్మా, ఇంక దాని బదులు చనిపోవచ్చు గదా’ అని ఆయన భార్య అన్నది. ఆ సమయంలో వారిలో ధైర్యం నింపి సముదాయించడానికి తీవ్రంగా ప్రయత్నించాల్సి వచ్చింది.

రామ్: మీ పాదయాత్రలో ప్రతిరోజూ చంద్రబాబునాయుడును ఎక్కువగా విమర్శిస్తున్నారనిపించడం లేదా?
షర్మిల: నాన్న ఒక మాట అనేవాడు - విశ్వసనీయతే మనిషికి విలువ నిస్తుంది - అని! అన్న కూడా ఇదే నమ్ముతాడు. మరి చంద్రబాబు నాయుడు గారికి అదే విశ్వసనీయత ఉండి ఉంటే మేము విమర్శించే అవసరమే లేదు. చంద్రబాబు మొట్టమొదట కాంగ్రెస్‌లో ఉన్నారు. కాంగ్రెస్‌లో ఉండి ఎమ్మెల్యే అయ్యి నాన్న సహాయం చేస్తే మంత్రి అయ్యాడన్న విషయం నాన్నకు తెలుసు, చంద్రబాబుకు తెలుసు. మేమైతే నిజం చెబుతాం. అవతలివారు ఏం చెబుతారో మాకు తెలియదు గానీ... చంద్రబాబు మంత్రి అయ్యారు. ఎన్టీఆర్‌గారు పార్టీ పెడితే ఆ ఎన్నికలలో ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడి ఎన్టీఆర్‌కి వ్యతిరేకంగానైనా పోటీచేస్తానని ప్రగల్భాలు పలికి.. ఓడిపోయాడు. ఓడిపోయిన వ్యక్తి విశ్వసనీయత ఉంటే కాంగ్రెస్ పార్టీలోనే ఉండేవాడు. ఇక్కడ మంత్రిపదవి లేదు.. అక్కడ పదవి కనిపిస్తోంది మామగారి దగ్గర. పెట్టేబేడా సర్దుకుని కాంగ్రెస్ పార్టీకి హ్యాండిచ్చి పదవికోసమని ఎన్టీఆర్ పంచన చేరాడు. అప్పుడు ఈనాడు పత్రికలో ఒక ఆర్టికల్ కూడా వచ్చిందట- ఇల్లరికం వచ్చిన అల్లుడు - అని! పెట్టేబేడా పట్టుకుని ఉన్న చంద్రబాబు కార్టూను కూడా వేశారట. ఎన్టీఆర్ గారు పాపం అంతగా విమర్శించిన చంద్రబాబును చేర్చుకుని.. ఎంత మంది వద్దన్నా పార్టీలో పదవిని కల్పించారు. ఆ మాత్రం కృతజ్ఞతన్నా ఉండాలి కదా మనిషన్నాక. లేదు. పాపం మంచివాడనుకుని పిల్లనిచ్చాడు. ఈయన ఇలాంటోడు అని తెలిసి కూడా పదవిచ్చాడు. చంద్రబాబు మాత్రం ఎన్టీఆర్ గారు గెలిపించిన ఎమ్మెల్యేలను బంధించో, బెదిరించో వాడుకుని, ఆయనకు వెన్నుపోటు పొడిచి ఆయన పదవినే లాగేసుకుని ఆయన కుర్చీలో కూర్చున్నాడు. ఎన్టీఆర్‌గారు పిచ్చోడని ప్రచారం చేశాడు. ఆయన మీద చెప్పులేయించాడు. మానసికంగా హింసించి అన్యాయంగా ఆయనను అర్ధాయుష్షులోనే చంపేశాడు. మొదటి ఎలక్షన్లోనేమో ఎన్టీఆర్ గారి వల్ల ఈయనకు అధికారం వచ్చింది. ఈయన గెలవలేదు. ఎన్టీఆర్ గారి నుంచి లాగేసుకున్నాడు. రెండోసారి 1999లో మతతత్వ పార్టీ బీజేపీతో పొత్తుపెట్టుకున్నారు. అప్పటికి కార్గిల్ యుద్ధం వల్ల బీజేపీ పట్ల సానుభూతి ఉంది. కార్గిల్ యుద్ధంలో చనిపోయిన వారి శవాల మీద ఓట్లేరుకుని రెండోసారి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయ్యి ఏమన్నా మంచిపనులు చేశాడా అంటే ఏమీ చేయ లేదు. నాలుగువేల మంది రైతులను పొట్టనపెట్టుకున్నాడు. వారి గోడు ఒక్కరోజు విన్నపాపాన పోలేదు. వారు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు అని అంటే ఒక్క రూపాయి సహాయం చేయలేదు. రాజశేఖరరెడ్డిగారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు హయాంలో చనిపోయిన వారి కుటుంబాలకు కూడా లక్ష రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇచ్చారు. వారి అప్పులను తీర్చడానికి బ్యాంకులతో మాట్లాడి వన్‌టైమ్ సెటిల్ మెంట్ కింద మరో 50 వేల రూపాయలను ఆ రైతులకు సహాయం చేశారు. నాన్నగారు ఎప్పుడూ అనేవారు- రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబునాయుడుగారు రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారు అని! కేజీ బేసిన్‌లో దొరికే గ్యాస్ పైప్‌లైన్‌ల ద్వారా మన రాష్ట్రంలో తక్కువ ధరకు అందరికీ ఇవ్వవచ్చు. రాష్ర్టంలో విద్యుత్ అవసరాలు, గ్యాస్ అవసరాలు తీరతాయి. అలాంటి లక్షల కోట్లు విలువ చేసే ప్రాజెక్టు మన రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడుతుందని తెలిసీ అన్యాయంగా బంగారుపళ్లెంలో పెట్టి ఇచ్చేశాడు సొంతలాభం కోసం. నాన్న ఎప్పుడూ అనేవాడు- చంద్రబాబు నాయుడు చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడు అని! అంతేకాకుండా 2004 ఎన్నికలలో అలిపిరి ఘటనను పోస్టర్లపై అంటించుకుని ఎన్నికలకు వెళ్లాడు సానుభూతి కోసం. ప్రజలు నమ్మలేదు. బుద్ధిచెప్పారు. చంద్రబాబు మళ్లీ ప్రజలను మోసం చేయాలని ఈరోజు పాదయాత్ర చేస్తున్నాడు. పాదయాత్రలో తన తొమ్మిదేళ్ల పాలనలో ఏం చేశాడో చెప్పడం లేదు. నా రాజ్యం తీసుకొస్తా అని చెప్పడం లేదు. ఆ ధైర్యం లేదు. ఆయనకు తెలుసు ఆయన ఎంత ఘోరంగా పరిపాలన చేశాడో! రాజశేఖరరెడ్డిగారు ఏ మంచి పనులైతే చేశాడో అవన్నీ చేస్తానని చెబుతున్నాడు. పచ్చి అబద్దాలు చెబుతున్నాడు. గ్యాస్ ధరలు పెంచలేదంట. ఆర్టీసీ ధరలు పెంచలేదంట. కరెంటు చార్జీలు పెంచలేదట. మైకు పట్టుకుని పచ్చి అబద్దాలు చెబు తున్నాడు. హిట్లర్ దగ్గర గోబెల్స్ అని ఒక మంత్రి ఉండేవాడు. ఆయనకేమీ పనిలేదు. అబద్దాలు ప్రచారం చేయడమే. చంద్రబాబు నాయుడు కూడా ఒకేమాటను పదిసార్లు చెబితే అదే నిజమైపోతుందనుకుంటారు. ఇన్ని చేసి కూడా మళ్లీ ప్రజలను మోసం చేయాలనుకుని గోబెల్స్ ప్రచారం చేస్తూ ఈ రోజుకు కూడా తిరుగుతున్నాడంటే ఇంక ఆయన్ను విమర్శించక మమ్మల్నేం చేయమంటారు? ‘‘రాజశేఖరరెడ్డి చాలా బాగా చేశారు.. నేను బాగా చేయలేదు.. నాకు బుద్ధి వచ్చింది. రాజశేఖరరెడ్డిగారు ఏది చేశారో నేను అదే చేస్తాను.. రాజన్న రాజ్యం తెస్తాను..’’ అని చెప్పమనండి... రేపట్నుంచి మానేస్తాం చంద్రబాబును విమర్శించం.

రామ్: వైఎస్ రాజశేఖరరెడ్డి గారు కాంగ్రెస్ విధేయులు. ఆయన కాంగ్రెస్ పార్టీకి అత్యంత విశ్వాసపాత్రుడన్న సంగతి తెలిసిందే. అలాంటి పార్టీని ఇప్పుడు విమర్శిస్తుంటే మీకు బాగా అనిపిస్తుందా?
షర్మిల: నిజమే... నాన్న ఎప్పుడూ కాంగ్రెస్‌వాదే. ముప్పై ఏళ్లు ఆ పార్టీకి సేవ చేశాడు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఆ పార్టీలోనే ఉన్నాడు. తను పాదయాత్ర చేసిన తర్వాత తనకు వచ్చిన ప్రతిష్టకు ఎంతోమంది ‘పార్టీ పెట్టి నువ్వే గెలవొచ్చు, నువ్వే గెలుస్తావు, పార్టీ పెట్టుకోవచ్చు’ అని సూచించినా.. అదే పార్టీలోనే ఉండాలని, ఉండి.. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఏ పథకం ప్రారంభించినా, ఏ కార్యక్రమం చేసినా గాంధీ కుటుంబం పేర్లే పెట్టి చాలా విధేయంగా ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? రాజశేఖరరెడ్డి గారి పేరును ఎఫ్.ఐ.ఆర్.లో చేర్చింది. అది చాలా బాధాకరం. నాన్నగారి వల్ల అధికారంలోకి వచ్చిన పార్టీ అది.. ఇది సత్యం. వారికి ఇష్టం ఉన్నా లేకున్నా అది నిజం. వాళ్లు ఒప్పుకున్నా ఒప్పుకోక పోయినా, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందీ అంటే.. అది కేవలం నాన్నగారి వల్లనే వచ్చింది. ఇంతచేసినా కనీస కృతజ్ఞత లేకుండా... లేని మనిషిని.. అయ్యో.. తను సమాధానం చెప్పుకోలేడే, తను లేడే అని కనీస ఆలోచన లేకుండా రాజశేఖరరెడ్డి గారి పేరును ఎఫ్.ఐ.ఆర్‌లో చేర్చింది. రాజశేఖరరెడ్డి గారు ఆ పార్టీకి ఎంత విధేయుడుగా ఉన్నాడో, మొదటి నుంచి కూడాజగనన్న అంతే విధేయుడుగా ఉన్నాడు. 150 మంది ఎమ్మెల్మేలు జగనన్న ముఖ్యమంత్రి కావాలని సంతకం పెట్టారు. ఈ వార్త అన్ని పత్రికల్లోనూ వచ్చింది. సంతకం పెట్టించిన వారు కాంగ్రెస్‌లోనే ఉన్నారిప్పుడు.. సంతకం పెట్టిన వారూ కాంగ్రెస్‌లోనే ఉన్నారిప్పుడు. వారే సంతకం పెట్టారు, జగనన్న ముఖ్యమంత్రి కావాలి అని! కానీ, జగనన్న ఏనాడూ ఆ పేపర్ పట్టుకొని మీడియా ముందుకు వెళ్లి.. ‘ఇదుగో వీళ్ల సంతకాలు నాకున్నాయి, నేనే ముఖ్యమంత్రిని’ అని ప్రకటించుకోలేదు. చంద్రబాబు నాయుడు గారి లాగ వైస్రాయ్ హోటల్‌లో ఎమ్మెల్యేలను పెట్టినట్లు.. మేం ఇడుపులపాయలోనో, ఇంట్లోనో వాళ్లను పెట్టుకోలేదు. సంతకాలు ఇవిగో, ఎమ్మెల్యేలు ఇరుగో.. నేనే ముఖ్య మంత్రిని అవుతాను అని జగనన్న చెప్పలేదు. చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్‌ని అధికారం కోసం వీడినట్లు, జగనన్న అధికారం కోసం వీడ లేదు. ఎంతో విధేయుడుగా.. అంతమంది సంతకాలు పెట్టినా కూడా.. జగనన్న ప్రణబ్ ముఖర్జీ గారి సాక్షిగా, ఇప్పుడున్న రాష్ట్రపతి గారి సాక్షిగా, రోశయ్యని (సీఎంగా) ప్రతిపాదించారు. నాన్న విధేయుడుగా ఉన్నాడు కనక ఆ పార్టీకి విధేయుడుగా ఉండాలన్న దృష్టితో అలా చేశాడు.. కానీ, నాన్న హఠాన్మరణం తర్వాత నల్లకాలువ సభలో జగనన్న ఒక మాట ఇచ్చాడు - ‘ప్రజలంతా మా కుటుంబం. మీ కోసం నేనున్నాను. నా తండ్రి మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలను రానున్న రోజుల్లో పరామర్శిస్తాను’ అని! అప్పటికే మా కుటుంబం చాలా బాధపడుతూ ఉంది. నాన్న పోవడంతో.. శిరస్సు కట్ చేస్తే బాడీ ఎలా ఉంటుందో అలా ఉంది మా పరిస్థితి. అంతటి పరిస్థితిలో ఉండి.. ఒక ఆలోచన చాలా కలచివేసింది. ‘మేం చాలా బాధపడుతూ ఉన్నాం. కానీ, నాన్నగారు చనిపోయారన్న బాధతో 660 మంది ప్రాణాలు వదిలారు. వాళ్లు నాన్నను మాకంటే ఎక్కువ ప్రేమించారా’ అని అనిపించింది. అలాంటి వాళ్లను ఓదార్చడం జగనన్న తన కనీస బాధ్యత అనుకున్నాడు. ఆ తండ్రికి తగ్గ కొడుకుగా కనీస బాధ్యత అనుకొని.. నేను వస్తాను అని మాటిచ్చాడు. అది పర్సనల్.. పార్టీకి సంబంధం లేదు. పర్సనల్‌గా ఒక కొడుకు స్థానంలో ఉండి మాట ఇవ్వడం జరిగింది. పశ్చిమ గోదావరి, ఖమ్మంలలో ఓదార్పు యాత్రలకు వచ్చిన ఆదరణను చూసి.. జగనన్నకు వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుందన్న దుగ్ధతో ఓదార్పు యాత్రను కాంగ్రెస్ అధినాయకులు ఆపేయమన్నారు. అర్థం చేసుకునే స్థితిలో వాళ్లు లేరు. అప్పుడు కూడా పార్టీని వదల్లేదు. జగనన్న వీలైన నాయకులందర్నీ అడిగాడు. అన్నతోపాటు అమ్మ, నేను కూడా వెళ్లాం సోనియా గాంధీ గారి దగ్గరకు. ‘అమ్మా మేం మాటిచ్చాం. ఇది నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మాట తప్పలేము’ అని ఎంత చెప్పినా అర్థం చేసుకునే స్థితిలో వాళ్లు లేరు. అప్పటికీ పార్టీని వదల్లేదు. ఎన్ని రకాలుగా జగనన్నను హింసించి, చిన్న చేసి, ఎంతోమందిని ఆయనకు వ్యతిరేకంగా తయారుచేసి, పొగపెట్టి.. ఇక ఊపిరాడదు అన్న దశలో జగనన్న బయటకు రావాల్సి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి లాగ అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు రాలేదండి! జగనన్న వచ్చిన కారణం.. ఇచ్చిన వాగ్దానం! నాన్న మాకు నేర్పించింది.. ‘ఇచ్చిన మాట మీద నిలబడకపోతే మనకు విలువ ఉండదు’ అనేది. జగనన్న ఈ మాటను పూర్తిగా నమ్మాడు గనక.. ఇచ్చిన మాట తప్పలేకపోయాడు గనక.. ఆ పార్టీలోనే ఉంటే తనను ఓదార్పు యాత్ర చేయనీయరు గనక.. బయటకు రావాల్సి వచ్చింది. మాట ఇచ్చినందుకు జగనన్న ఓదార్పుయాత్ర చేస్తూ ఉంటే.. అప్పుడు కాంగ్రెస్ వాళ్లు అన్నమాట - ‘చేతి గుర్తును పెట్టుకొని గెలిచి, హైకమాండ్ చెప్పిన మాట కాదని ఎలా ఓదార్పు యాత్ర చేస్తారు?’ అని! నిజానికి గెలిచింది.. ఆ పార్టీని గెలిపించింది.. నాన్న! అది సత్యం. కానీ, ధర్మంగా ఆలోచిస్తే.. ఆ పార్టీ నుంచి గెలిచి, ఆ పార్టీ మాటను కాదనడం ధర్మం అనిపించలేదు. ధర్మం కాదు గనక, ఆ పార్టీలో ఉండి ఆ మాట నిలబెట్టు కునే అవకాశం లేకపోయింది గనుక.. జగనన్న ఆ పార్టీ నుంచి బయటకు రావాల్సి వచ్చింది. వచ్చి.. ఈరోజు ఆ పార్టీని విమర్శిస్తున్నామూ అంటే.. ఎందుకు విమర్శిస్తున్నాం? ఓదార్పు యాత్రను కాదన్నారు కాబట్టి విమర్శిస్తున్నామా? కాదు గదా! రాజశేఖరరెడ్డి గారు చిత్తశుద్ధితో అమలు చేసిన పథకాలను మీరు నీరుగారుస్తున్నారు. ఆరోగ్యశ్రీ అయితేనేం, ఫీజు రీయింబర్స్‌మెంట్ అయితే నేం, పావలా వడ్డీ అయితే నేం.. ఉపాధి హామీ అయితే నేం.. మీరు ఏదైనా తీసుకోండి.. జలయజ్ఞం అయితే నేం.. రుణ మాఫీ అయితేనేం.. రాజశేఖరరెడ్డి గారిలా చిత్తశుద్ధితో ఈ పథకాలను అమలు చేయమని చెప్పమనండి.. మేం ఎందుకు విమర్శిస్తాం?

రామ్: మీరు జలయజ్ఞం అంటే గుర్తొచ్చింది. నెట్టెంపాడు దగ్గర మీరు చాలా ఉద్వేగానికి గురయ్యారు.. మీరు కంటతడి పెట్టుకున్నారు.. నాన్నను ప్రభుత్వం గుర్తు చేసుకోలేదని!
షర్మిల: నెట్టెంపాడైనా, హంద్రీ నీవా అయినా లేక వారు ప్రారంభోత్సవం చేస్తున్న ఏ ప్రాజెక్టు అయినా.. ఈ రోజు ఆ దశకు వచ్చాయంటే అది నాన్న గారి వల్ల వచ్చాయి. నాన్న గారికి చేయాలనిపించకపోతే.. చిత్తశుద్ధితో చేసి ఉండకపోతే ఈ రోజు ఆ ప్రాజెక్టులు వచ్చేవి కాదు.. ఇన్ని సంవత్సరాలైంది మనకు స్వాతంత్య్రం వచ్చి, ఏ ప్రాజెక్టూ ఈ దశకు రాలేదు. కానీ, ఇలా వచ్చాయీ అంటే అది ఆయన ఉన్న 5 సంవత్సరాలలో జరిగిన పనుల వల్ల. అలాంటిది ఈరోజు కాంగ్రెస్ వాళ్లు నెట్టెంపాడు అయితేనేమి, హంద్రీ నీవా అయితేనేమి.. ప్రారంభోత్సవం చేస్తూ ఒక్కసారి కూడా రాజశేఖరరెడ్డి గారి పేరును ముఖ్యమంత్రి గారు ఉచ్ఛరించలేదు. నిజానికి వీరికి ఉచ్ఛ రించే అర్హత లేదు. కానీ.. ఆయనకు ఇవ్వాల్సిన ఘనతను ఇవ్వడం వీళ్ల కనీస బాధ్యత. ఎందుకంటే అది చేసింది రాజశేఖరరెడ్డి గారు. ప్రజలకు తెలుసు. వాళ్లకి కూడా తెలుసు. కానీ, ఈ రోజు ఆయన పేరును కనీసం ప్రస్తావించలేదు. చాలా బాధేసింది. నెట్టెంపాడు నీళ్లను చూస్తే.. నాన్న ఉంటే, నేను నిల్చున్నచోట నాన్న ఉంటే.. ఎంత సంతోషించే వారో అనిపిం చింది. ఒకపక్క చాలా గర్వంగా ఉండింది... నాన్న చేశాడూ ఇది అని. ఇన్ని లక్షల ఎకరాలకు నీళ్లొస్తున్నాయంటే చాలా సంతోషమనిపిం చింది. కానీ, ఈ మనుషులను చూస్తే, విలువలు లేని కుళ్లు రాజకీయాలు చూస్తే చాలా బాధేసింది. నాన్న పేరును ఒక్కసారి కూడా అనుకోలేక పోయారు వీళ్లు అని! మనసును చాలా కలచివేసింది. ఎంతోమంది మంత్రులు, రాజ్యసభ సభ్యులు.. చాలా మంది ఉన్నారు. నాన్నగారు చేస్తే, నాన్నగారు ఇస్తే వారు ఆ పదవులను అనుభవిస్తున్నారు. కానీ, నాన్న గారి తరఫున ఏ ఒక్కరూ మాట్లాడలేదు. నాన్న గారి పేరును ఎఫ్.ఐ.ఆర్‌లో చేరుస్తుంటే అందరూ వేడుక చూశారు. చీమకుట్టినట్లయినా అనిపించలేదు వాళ్లకు..

రామ్: ద్రోహం.. ద్రోహం కలచి వేసింది మిమ్మల్ని..!
షర్మిల: అవును.. ఎలా తయారయ్యాయి మన రాజకీయాలు.. నాన్న గారు లేనందుకు బాధేస్తా ఉంది. కానీ, ఈ రోజు రాజకీయాల్లో విలువలు లేనందుకు, మానవత్వం లేనందుకు చాలా చాలా బాధేసింది.

రామ్: ఇన్ని రోజుల పాదయాత్ర తర్వాత రాజకీయం అంటే ఏమి అర్థమైంది?
షర్మిల: చనిపోయింది నాన్న కాదని... చనిపోయింది రాజకీయాల్లోని మానవత్వమని అర్థమైంది. మళ్లీ ఆ మానవత్వం చిగురించాలంటే.. జగనన్న రావాలి. జగనన్న వస్తే తప్ప అది జరగదు. 

రామ్: ఈ మొత్తం ప్రయాణంలో మీరు ఏం మిస్సవుతున్నారు..? 
షర్మిల: మా కుటుంబం.. అనిల్.. పిల్లలు.. అమ్మను మిస్సవుతున్నాను. అయితే, వాళ్లు వచ్చి నన్ను చూసి వెళ్తున్నారు.. కానీ, నేను బాగా మిస్సయ్యేది అన్నని. ఆయన రాలేడు. నేనూ పోలేను. అన్న లేని లోటూ.. అన్న దూరమైన లోటు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికి 52 రోజులైపోయింది అన్నను చూసి... కష్టంగానే ఉంది.

రామ్: పుట్టిన రోజు వేడుకలను ఎలా జరుపుకోవాలనుకుంటున్నారు?
షర్మిల: నాకు వేడుకైనా, పండగైనా అన్న వచ్చాకే! అప్పటివరకూ ఏమీ లేదు. 

రామ్: ఒకరోజు పిల్లలు మీతో పాటు పాదయాత్రలో నడిచారు.. ఎంత అందమైన అనుభూతి.. 
షర్మిల: (నవ్వుతూ) అవును..

రామ్: మీ కుటుంబం ఎలా స్పందిస్తోంది..? ఇన్ని రోజులు అమ్మ దగ్గర ఉండకపోవడం... భార్య భర్త దగ్గర ఉండకపోవడం.. ఒక్కోసారి వదిన తన మరదలు దగ్గర లేకపోవడం.. అమ్మ తన బిడ్డల దగ్గర లేకపోవడం.. ఈ పరిస్థితిని ఎలా చూస్తున్నారు?
షర్మిల: అమ్మ మామూలే - బాగా తింటున్నావా, బాగా నిద్రపోతున్నావా జాగ్రత్త అని చాలా ఆప్యాయంగా అడుగుతుంది. అన్నకేమో చాలా ఆందోళన - ఇంతమంది జనం. ఇంత నడక ఎలా ఉందీ, ఏమిటీ - అని అడుగుతున్నాడంట! వదినేమో ‘బాగున్నావా పాపా.. జాగ్రత్తమ్మా... జాగ్రత్తగా ఉండు’ అంటుంది. అనిల్ చాలా సహకరిస్తున్నారు. ఆయన, పిల్లలు నన్ను మిస్సవుతున్నారు. మా అబ్బాయి రాజా ఓకే.. అర్థం చేసుకుంటాడనుకుంటున్నాను. ఉద్వేగాలను పెద్దగా బయటకు చెప్పే రకం కాదు. బాగానే ఉన్నట్లు కనపడతాడు.

రామ్: మౌనంగా బాధను భరిస్తున్నాడంటారా?
షర్మిల: అలా ఏం కాదు. బాగానే ఉన్నాడు... జిల్లీని చాలా మిస్సవు తున్నాను.. నేనంటే చాలా తనకు చాలా ప్రేమ. తను మాత్రం ‘అమ్మా.. అమ్మా..’ అంటూ ఇప్పటికీ మెసేజ్‌లు.. ఫోన్లు.. అదేపనిగా చేస్తూ ఉంటుంది. అయితే, అందరూ బాగానే ఉన్నారు.. దేవుని దయవల్ల అంతా బాగానే జరుగుతోంది.. ప్రజలు బాగా స్పందిస్తున్నారు! 

రామ్: వైఎస్ అన్న లేని లోటు.. జగన్ గారు దగ్గర లేని లోటు ప్రజలు మీలో చూసుకుంటున్నారు... 
షర్మిల: ప్రజలందరూ నాపై ప్రేమను కురిపిస్తున్నారు. ఈ ప్రేమంతా నిజానికి నామీద కాదు. అది నాన్న మీద వారికున్న అభిమానం. అన్న మీద వారికున్న ప్రేమ. రాజన్న, జగనన్న ఇద్దరూ అందుబాటులో లేనందున వారిపై ఉన్న ప్రేమను నాపై చూపిస్తున్నారు. నిజంగా చెప్పాలంటే.. కొన్నిసార్లు చాలా ఉద్వేగంగా, ఆశ్చర్యంగా అనిపిస్తుంది... కాంగ్రెస్-సీబీఐ కుమ్మక్కు రాజకీయాలకు, టీడీపీ- కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలకు కొత్తగా మరో తెరలేచింది. టీడీపీ నుంచి ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఎఫ్‌డీఐకి వ్యతిరేకంగా ఓటేయకుండా గైర్హాజరయ్యారు..

రామ్: స్పష్టంగా అర్థమవుతుంది.. ఎవరు కుమ్మక్కయ్యారనేది. 
షర్మిల: ఎంతో ప్రాధాన్యం ఉన్న ఎఫ్‌డీఐ బిల్లును కాంగ్రెస్‌కు అనుకూలంగా ఆమోదింపజేయడానికి వీళ్లు గైర్హాజరయ్యారు. కుమ్మక్కు విషయం చాలా స్పష్టంగా, కళ్లకు కట్టినట్టుగా బయటపడింది. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ గారు చక్కటి వాస్తవాన్ని ప్రకటించారు. ములాయం, మాయావతి వంటి వారిని మేనేజ్ చేసుకొని, భయపెట్టి, సీబీఐని వాడుకొని కాంగ్రెస్ బిల్లు పాస్ చేయించుకుంది. అంటే, గెలిచింది కాంగ్రెస్ కాదు, సీబీఐ అని ఆమె అన్నారు. అది నిజం. కాంగ్రెస్ మాట వినే వారి పట్ల, వినని వారి పట్ల వ్యవహరించే తీరులో స్పష్టంగా తేడా ఉంది. 

జగనన్న పార్టీ నుంచి బయటకు వచ్చింది నవంబర్ 27న. రెండు రోజుల్లో అంటే నవంబర్ 29 నాటికల్లా ఇన్‌కం టాక్స్ నోటీసులు వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కేసుంది. కానీ, సిబ్బంది కొరత ఉందంటారు. కానీ, జగనన్న మీద మటుకు వందల మందితో కూడిన 29 టీములు వస్తాయి.. బెంగళూరులో నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు కూడా ఇంటిని సోదా చేశారు. ఇలాంటి సంఘటనలు ఎన్నో.. 2000 టెలిఫోన్ కాల్స్ టాప్ చేశారు. వివక్ష స్పష్టంగా ఉంది.. కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌చార్జ్ ఆజాద్ గారు తిరుపతిలో ఉప ఎన్నికల సందర్భంగా మాట్లాడుతూ జగన్ కాంగ్రెస్‌లో ఉండి ఉంటే కేంద్ర కేబినెట్ మంత్రిగా గానీ, ముఖ్యమంత్రిగా గానీ అయ్యేవారని చెప్పారు. దీన్నెవరూ మళ్లీ విడమర్చి చెప్పక్కర్లేదు, ఆయనే ఒప్పుకుంటున్నారు. ఈ రోజు కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కయి రాజకీయాలు చేస్తున్నాయి. కనుకనే, చంద్రబాబు మీద కేసులు పెట్టడం లేదు, విచారణ జరపడం లేదు. అందుకే చంద్రబాబు అవిశ్వాసం పెట్టడం లేదు. వాళ్లు చెబుతున్నట్లు జగనన్న కుమ్మక్కు రాజకీయాలు చేసుంటే.. జైల్లో ఉండడు. ములాయంసింగ్ యాదవ్ లాగనో, మాయావతి లాగనో ఈయన కూడా వత్తాసు పలికి అధికారం అనుభవించే వాడు.

ముఖ్యమంత్రిగానో, కేంద్ర మంత్రిగానో ఉండే వారు. జగనన్న మాట మీద, విలువల కోసం నిలబడ్డాడు గనక జైల్లో ఉన్నాడు. చంద్రబాబు చీకట్లో చిదంబరంతో మాట్లాడుకుంటాడు. కాంగ్రెస్‌లో ఉన్నారు కాబట్టి బొత్స సత్యనారాయణ వంటి మంత్రులపై ఎన్ని కేసులున్నా వారికేమీ కాదు. వారికి ఎప్పుడూ ఏమీ కాదు. రాసిస్తుంది మా పార్టీ. కాంగ్రెస్‌లో లేని వారైతే వారికి వ్యతిరేకంగా ఒంటికాలితో వస్తుంది ప్రభుత్వం. ఎవరు కుమ్మక్కవుతున్నదీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. అన్ని పార్టీలకూ బుద్ధి చెప్పే ఒక రోజంటూ వస్తుంది. ప్రపంచం యావత్తునూ ఆశ్చర్యపరిచేలా జగనన్నకు విజయం చేకూర్చుతారు. ఆ రోజు వస్తుంది. 

రామ్: పాదయాత్రలో చాలా మంది శిశువులకు రాజశేఖర్, జగన్, విజయమ్మ అని పేర్లు పెడుతున్నారు కదా. షర్మిల అని పేరు పెట్టాలని మీకు అనిపించలేదా?
షర్మిల: నాన్నా, అమ్మ, అన్న గొప్ప స్ఫూర్తిదాయక వ్యక్తులు. నేను ఇంకా అంత గొప్పదాన్ని అవ్వలేదు. ఇక ముందూ వారి పేర్లే పెడతాను. 

రామ్: జగన్ పాదయాత్ర చేసినప్పుడు షర్మిల అని పేరు పెడతారేమో! హాపీ బర్త్ డే.. గాడ్ బ్లెస్ యూ... మీ ఆకాంక్షలన్నీ నెరవేరే రోజు వస్తుందని ఆశిస్తున్నాను.
షర్మిల: (నవ్వుతూ) థాంక్యూ!!

షర్మిలకు శస్త్రచికిత్స

మోకాలిలో లేటరల్ మెనిస్కస్, మీడియల్ కొల్లేటరల్
లిగమెంటుకు బలమైన గాయాలైనట్టు వైద్యుల నిర్ధారణ
సర్జరీ తర్వాత 3 వారాలపాటు విశ్రాంతి తప్పనిసరి
దీంతో పాదయాత్ర మూడు వారాలపాటు వాయిదా
గాయం తగిలిన రోజు ఆగకుండా 4 కిలోమీటర్లు నడిచిన షర్మిల.. దాంతో పెరిగిన గాయం తీవ్రత



వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల మోకాలికి అయిన గాయం తీవ్రత ఊహించినదానికంటే అధికంగా ఉందని, శస్త్రచికిత్స అత్యవసరమని వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు మంగళవారం అపోలో ఆసుపత్రిలో ఆమెకు సర్జరీ చేయాలని నిర్ణయించారు. శస్త్ర చికిత్స అనంతరం కనీసం మూడు వారాలు ఆమె విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఆ మేరకు ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర వాయిదా పడింది. షర్మిల కోలుకోగానే తిరిగి రంగారెడ్డి జిల్లా ఇంజాపూర్ నుంచే పాదయాత్రను కొనసాగించనున్నారని పార్టీ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి వెల్లడించారు. వాస్తవానికి మంగళవారం ఉదయమే శస్త్రచికిత్స చేయాలని వైద్యులు చెప్పగా.. షర్మిల తన అన్న జగన్‌మోహన్‌రెడ్డిని చూశాకే ఆపరేషన్ చేయించుకుంటానని పట్టుబడుతున్నారని అన్నారు. దీంతో మంగళవారం ఉదయం జైలుకు వెళ్లి జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి వచ్చాక మధ్యాహ్నం శస్త్రచికిత్స చేసేలా ఏర్పాట్లు చేశారన్నారు.

రెండు రకాల గాయలు..

షర్మిలకు ఆదివారం చేసిన ఎమ్మారై స్కానింగ్ రిపోర్టులు సోమవారం అందాయి. వాటిని పరిశీలించిన వైద్యులు.. ఊహించినదానికంటే గాయం తీవ్రత ఎక్కువగా ఉందని, షర్మిల మోకాలిలో రెండు రకాల గాయాలయ్యాయని నిర్ధారణకొచ్చారు. మోకాలిలో ‘లేటరల్ మెనిస్కస్’ భాగం కొంత మేర తెగిపోయి పాడైందని, దాన్ని తొలగించి మిగతా భాగాన్ని బాగుచేయాల్సి ఉందని ఆర్థోపెడిక్ వైద్యులు సోమశేఖరరెడ్డి, రఘువీరారెడ్డి, శివభారత్‌రెడ్డి తెలిపారు. ఇక మీడియల్ కొల్లేటరల్ లిగమెంటుకు పాక్షిక గాయమైందని, అయితే అది అతుక్కోవడానికి కనీసం మూడు వారాలు పడుతుందని చెప్పారు. అత్యవసరంగా శ్రస్త్ర చికిత్స చేయాలని, లేకుంటే నొప్పి తీవ్రత మరింతగా పెరిగే అవకాశం ఉందని అన్నారు. 

మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు అపోలో ఆసుపత్రిలో కీహోల్ శస్త్ర చికిత్స నిర్వహిస్తామన్నారు. శస్త్ర చికిత్సకు సుమారు ఒక గంట సమయం పడుతుందని, బుధవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామని వారు చెప్పారు. ఆపరేషన్ అనంతరం కాలుకు సిమెంటు పట్టీ వేస్తామని, ఈ పట్టిని కనీసం మూడు వారాలు తీయకుండా ఉంచాలన్నారు. కనీసం మూడు వారాలకు పైగా విశ్రాంతి తీసుకుంటేనే దెబ్బతిన్న లిగమెంటు తిరిగి పూర్వపు స్థితికి వస్తుందని ఆయన చెప్పారు. మూడు వారాల తర్వాత పట్టీ విప్పి పరిస్థితిని సమీక్షించాక.. మరింత కాలం విశ్రాంతి అవసరమా లేదా అన్నది చెప్తామన్నారు. కాగా సోమవారం అపోలోలో షర్మిలకు పలు వైద్య పరీక్షలు చేశారు.

భారీగా తరలివచ్చిన అభిమానులు

సోమవారం షర్మిల జన్మదినం కావడంతో ఆమె బస చేసిన ప్రాంతానికి భారీ ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. ఆమెకు శుభాకాంక్షలు చెప్పేందుకు బారులు తీరారు. నడిచేందుకు కాలునొప్పి సహకరించకపోయినా ప్రజల ఆకాంక్ష మేరకు వాహనంపై ఉన్న రెడీమేడ్ వేదిక మీదకు ఎక్కి ఆమె కేక్ కోశారు. తన కోసం వచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. షర్మిల జన్మదినం సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డాక్టర్స్ సెల్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పుత్తా ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో చీరలు పంపిణీ చేశారు. షర్మిలను పరామర్శించిన వారిలో వైఎస్ వివేకానందరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, బి. జనార్ధన్, దేప భాస్కర్ రెడ్డి, గోనె ప్రకాశ్ తదితరులు ఉన్నారు.

గాయమైనా నడవడం వల్లే పెరిగిన తీవ్రత..

ప్రజా సమస్యలు పట్టని ప్రభుత్వ వైఖరికి, ఆ ప్రభుత్వంతో కుమ్మక్కైన టీడీపీ అధినేత చంద్రబాబు తీరుకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. యాత్ర 57వ రోజు శుక్రవారం రాత్రి రంగారెడ్డి జిల్లా బీఎన్‌రెడ్డి నగర్‌లో షర్మిల ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బస్సుపై ఏర్పాటు చేసిన వేదికపై ప్రసంగించి దిగుతుండగా ఎడమ కాలు జారి ముందుకు తూలిపడబోతూ.. షర్మిల తనను తాను నిలువరించుకున్నారు. ఈ ప్రయత్నంలో కుడి మోకాలికి మెట్లు బలంగా గుద్దుకున్నాయి. తీవ్ర నొప్పితో కొద్ది నిమిషాల పాటు ఆమె అక్కడే కూర్చుండిపోయారు. 

డాక్టర్ హరికృష్ణ ఆమెకు ప్రథమ చికిత్స చేశారు. తర్వాత కాలు నొప్పిని లెక్క చేయకుండా ఆమె బీఎన్‌రెడ్డి నగర్ నుంచి ఇంజాపూర్ వరకు 4 కిలోమీటర్లు నడిచి అక్కడ బస చేశారు. ఉదయానికి నొప్పి మరింత తీవ్రమవడంతో వైద్యులు పరీక్షించి యాత్ర కొన్ని రోజులు వాయిదా వేసుకోవాలని సూచించారు. ఆమె దానికి ససేమిరా అన్నారు. అదే రోజు మధ్యాహ్నం నుంచి యాత్ర చేస్తానని ఆమె పట్టుబట్టగా.. అప్పటికే అక్కడికి చేరుకున్న షర్మిల తల్లి వైఎస్ విజయమ్మ ఆమెను వద్దని వారించారు. కనీసం రెండు రోజులు వాయిదా వేసుకోవాలని సూచించడంతో అందుకు షర్మిల అంగీకరించారు. అయితే మరుసటిరోజుకు నొప్పి మరింత పెరగడంతో వైద్యులు ఆమెను దిల్‌సుఖ్‌నగర్ కోనార్క్ ఆసుపత్రికె తీసుకెళ్లి ఎమ్మారై స్కానింగ్ చేశారు. మోకాలికి దెబ్బ తగిలిన రోజు.. ఆమె ఆగకుండా మరో 4 కిలోమీటర్ల పాటు నడవడంతో గాయం తీవ్రత పెరిగిందని వైద్యులు వెల్లడించారు.

కష్టాల కొలిమి నుంచి మేలిమి బంగారం



రాష్ట్రాన్ని జనరంజకంగా పరిపాలించి రామరాజ్యానికి కృషి చేస్తూ అకాల మృతి చెందిన దివంగత నేత రాజశేఖరరెడ్డి లేనిలోటు తీర్చలేనప్పటికీ, తండ్రి ఆశయాలు కొనసాగించాలని ప్రజలంతా ఆకాంక్షిస్తున్న ఆయన తనయుడు జగన్‌పై అపవాదులు వేసి అణచి వేసే కుట్రను కాంగ్రెస్ నాయకులు పన్నడం అందరికీ తెలిసిందే! సీబీఐ మోపిన అభియోగాలనుంచి అపవాదులనే కష్టాల కొలిమిలో కాలి మేలిమి బంగారంలా జగన్ బయటపడే రోజు రాక మానదు. ఇక అడ్డదారిలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబుకు, ప్రస్తుత సి.ఎం. కిరణ్ కుమార్‌కు పెద్ద తేడా కనిపించడం లేదనిపిస్తోంది.

జనంలోకి చొచ్చుకు వెళ్లి కనీసం ఒక లక్షమందిని స్వప్రయోజకత్వంతో సమీకరించగల సత్తా పాలించే నాయకుడికి గానీ, ప్రధాన ప్రతిపక్షనేతకు లేదన్నది చేదునిజం. ఒళ్లు అలవకుండా అధికారం ఒళ్లో పడాలన్న పేరాశ పడితే కూడా మిగిలేది భంగపాటే. పతన మార్గంలో ప్రయాణిస్తున్న కాంగ్రెస్ సర్కారును వచ్చే ఎన్నికల్లో ప్రజలు రాజకీయ గాఢాంధకారంలోనెట్టి వేయక మునుపే వై.ఎస్. ఆశయాలను కొంతమేర సాఫల్యం చేయడానికి ప్రయత్నిస్తే చరిత్ర హీనులుగా కాకుండా ఉంటారు. చివరికి చెప్పేదేమిటంటే జగన్‌ని అడ్డుకోవడానికి కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్న కొద్దీ జగన్ వెంట నడిచే ప్రజల సంఖ్య లక్షలు, కోట్లగా పెరుగుతూనే ఉంటుంది.

- భూపతిరాజు అచ్యుతరామరాజు, భీమిలి


జగన్‌ని వేధిస్తే ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంటుంది


తెలుగు నాట కాంగ్రెస్ అనగానే ఠక్కున గుర్తొచ్చేది రాజశేఖరరెడ్డి పేరు మాత్రమే. ఆబాలగోపాలానికి ఆయన సుపరిచితం. అలాంటి ప్రజానాయకుని అంతిమ ఘడియలు ఇరవై నాలుగు గంటలపాటు నరాలు తెగే ఉత్కంఠభరితంగా నిలిచాయి. ఆయన మరణం కూడా అనుమానాస్పదంగా మిగిలిపోయింది. అలాంటి ప్రజాసేవకుని రక్తం పంచుకున్న జగన్‌ను ఎదగనివ్వకూడదనీ, తన చెప్పుచేతల్లోనే వుంచుకోవాలనీ, మర్రి నీడన మల్లె తీగను సాగనివ్వకూడదనీ అధిష్ఠానం కుట్రపన్నింది. కానీ, ఆంధ్ర ప్రజానీకం ఈ దుర్బుద్ధిని, దుష్ట ఆలోచనలను ఎండగడుతూ కోవూరు ఉపఎన్నికలో స్పష్టమైన తీర్పునిచ్చింది. 

అంతటితోనైనా మనసు మార్చుకోక వింత నెపాలతో మోసపూరిత కారణాలతో జగన్‌ని కారాగారంపాలు చేశారు హస్తిన నేతలు. దీంతో ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది. తదుపరి పదిహేను ఉపఎన్నికల్లో జగన్ పార్టీ విజయ బావుటా ఎగురవేసింది. నెల్లూరు లోక్‌సభ ఉపఎన్నికలో చరిత్రాత్మక తీర్పునిచ్చింది. పరకాలలో సైతం ప్రజాభిమానం పంకాకు దగ్గరగా వచ్చినట్లు తేటతెల్లమయింది. అప్పటికీ మత్తు వదిలించుకోని ఢిల్లీ రకరకాల ఆరోపణలతో చెరసాలలోనే జగన్‌ని మగ్గబెడుతూ సిబిఐ ద్వారా కక్ష సాధిస్తోంది. కానీ, ప్రజానాడిని పసిగట్టలేక తన పతనానికి తనే గొయ్యి తీసుకుంటున్నది. వైయస్‌ఆర్ కుటుంబానికి అనూహ్యమైన సానుభూతి, ప్రజాదరణ ఉంది. ఏదేమైనా 2014లో జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తీరతారు.

- కుమారి మన్నెముత్తుల మండోదరి, లేబూరు, ఇందుకూరుపేట (మం), నెల్లూరు జిల్లా

Sunday, December 16, 2012

కష్టాల కొలిమి నుంచి మేలిమి బంగారం


రాష్ట్రాన్ని జనరంజకంగా పరిపాలించి రామరాజ్యానికి కృషి చేస్తూ అకాల మృతి చెందిన దివంగత నేత రాజశేఖరరెడ్డి లేనిలోటు తీర్చలేనప్పటికీ, తండ్రి ఆశయాలు కొనసాగించాలని ప్రజలంతా ఆకాంక్షిస్తున్న ఆయన తనయుడు జగన్‌పై అపవాదులు వేసి అణచి వేసే కుట్రను కాంగ్రెస్ నాయకులు పన్నడం అందరికీ తెలిసిందే! సీబీఐ మోపిన అభియోగాలనుంచి అపవాదులనే కష్టాల కొలిమిలో కాలి మేలిమి బంగారంలా జగన్ బయటపడే రోజు రాక మానదు. ఇక అడ్డదారిలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబుకు, ప్రస్తుత సి.ఎం. కిరణ్ కుమార్‌కు పెద్ద తేడా కనిపించడం లేదనిపిస్తోంది. 

జనంలోకి చొచ్చుకు వెళ్లి కనీసం ఒక లక్షమందిని స్వప్రయోజకత్వంతో సమీకరించగల సత్తా పాలించే నాయకుడికి గానీ, ప్రధాన ప్రతిపక్షనేతకు లేదన్నది చేదునిజం. ఒళ్లు అలవకుండా అధికారం ఒళ్లో పడాలన్న పేరాశ పడితే కూడా మిగిలేది భంగపాటే. పతన మార్గంలో ప్రయాణిస్తున్న కాంగ్రెస్ సర్కారును వచ్చే ఎన్నికల్లో ప్రజలు రాజకీయ గాఢాంధకారంలోనెట్టి వేయక మునుపే వై.ఎస్. ఆశయాలను కొంతమేర సాఫల్యం చేయడానికి ప్రయత్నిస్తే చరిత్ర హీనులుగా కాకుండా ఉంటారు. చివరికి చెప్పేదేమిటంటే జగన్‌ని అడ్డుకోవడానికి కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్న కొద్దీ జగన్ వెంట నడిచే ప్రజల సంఖ్య లక్షలు, కోట్లగా పెరుగుతూనే ఉంటుంది.

- భూపతిరాజు అచ్యుతరామరాజు, భీమిలి

జగన్‌ని వేధిస్తే ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంటుంది


తెలుగు నాట కాంగ్రెస్ అనగానే ఠక్కున గుర్తొచ్చేది రాజశేఖరరెడ్డి పేరు మాత్రమే. ఆబాలగోపాలానికి ఆయన సుపరిచితం. అలాంటి ప్రజానాయకుని అంతిమ ఘడియలు ఇరవై నాలుగు గంటలపాటు నరాలు తెగే ఉత్కంఠభరితంగా నిలిచాయి. ఆయన మరణం కూడా అనుమానాస్పదంగా మిగిలిపోయింది. అలాంటి ప్రజాసేవకుని రక్తం పంచుకున్న జగన్‌ను ఎదగనివ్వకూడదనీ, తన చెప్పుచేతల్లోనే వుంచుకోవాలనీ, మర్రి నీడన మల్లె తీగను సాగనివ్వకూడదనీ అధిష్ఠానం కుట్రపన్నింది. కానీ, ఆంధ్ర ప్రజానీకం ఈ దుర్బుద్ధిని, దుష్ట ఆలోచనలను ఎండగడుతూ కోవూరు ఉపఎన్నికలో స్పష్టమైన తీర్పునిచ్చింది. 

అంతటితోనైనా మనసు మార్చుకోక వింత నెపాలతో మోసపూరిత కారణాలతో జగన్‌ని కారాగారంపాలు చేశారు హస్తిన నేతలు. దీంతో ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది. తదుపరి పదిహేను ఉపఎన్నికల్లో జగన్ పార్టీ విజయ బావుటా ఎగురవేసింది. నెల్లూరు లోక్‌సభ ఉపఎన్నికలో చరిత్రాత్మక తీర్పునిచ్చింది. పరకాలలో సైతం ప్రజాభిమానం పంకాకు దగ్గరగా వచ్చినట్లు తేటతెల్లమయింది. అప్పటికీ మత్తు వదిలించుకోని ఢిల్లీ రకరకాల ఆరోపణలతో చెరసాలలోనే జగన్‌ని మగ్గబెడుతూ సిబిఐ ద్వారా కక్ష సాధిస్తోంది. కానీ, ప్రజానాడిని పసిగట్టలేక తన పతనానికి తనే గొయ్యి తీసుకుంటున్నది. వైయస్‌ఆర్ కుటుంబానికి అనూహ్యమైన సానుభూతి, ప్రజాదరణ ఉంది. ఏదేమైనా 2014లో జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తీరతారు.

- కుమారి మన్నెముత్తుల మండోదరి, లేబూరు, ఇందుకూరుపేట (మం), నెల్లూరు జిల్లా

షర్మిల కాలికి గాయం.. యాత్రకు బ్రేక్

పట్టించుకోకుండా శనివారం మధ్యాహ్నం నుంచే యాత్రకు సిద్ధమైన షర్మిల
2 రోజులైనా యాత్ర ఆపాలని సూచించిన విజయమ్మ, వైవీ సుబ్బారెడ్డి
నేడు కూడా యాత్రకు విరామం

 
రంగారెడ్డి జిల్లాలో ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర చేస్తున్న షర్మిల కాలికి బలమైన గాయం కావడంతో ఆమె యాత్ర శని, ఆదివారాలు వాయిదా పడింది. షర్మిలకు శనివారం వైద్యులు పరీక్షలు నిర్వహించారు. కుడికాలు చిప్పకు బలంగా గాయం కావడంతో నొప్పి తీవ్రంగా ఉందని, కనీసం రెండు వారాల పాటు విశ్రాంతి అవసరమని డాక్టర్ ఆనంద్, డాక్టర్ హరికృష్ణ చెప్పారు. అయితే అన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవడానికి షర్మిల అంగీకరించలేదు. శనివారం మధ్యాహ్నం నుంచే పాదయాత్ర కొనసాగించేందుకు సిద్ధమయ్యారు. అక్కడికి చేరుకున్న షర్మిల తల్లి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, చిన్నాన్న వైవీ సుబ్బారెడ్డి.. ఆమెను వారించారు. కనీసం రెండు రోజులైనా విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో షర్మిల అంగీకరించారు. దీంతో ఆదివారం కూడా పాదయాత్ర కొనసాగదని ప్రోగ్రాం కమిటీ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, పార్టీ నాయకుడు కేకే మహేందర్‌రెడ్డి ప్రకటించారు. కాగా గాయపడిన షర్మిలను పరామర్శించేందుకు వచ్చిన మేడ్చల్ కార్యకర్తలనుద్దేశించి విజయమ్మ ప్రసంగించారు. జగన్, షర్మిలకు వారి ఆశీస్సులు కావాలని కోరారు. 


నొప్పిని భరిస్తూ 4 కిలోమీటర్లు..

ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో కుమ్మక్కైన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు వైఖరికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్రలో భాగంగా శుక్రవారం బీఎన్‌రెడ్డి నగర్‌లో షర్మిల ప్రసంగించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బస్సుపై ఏర్పాటు చేసిన వేదిక మీది నుంచి షర్మిల ప్రసంగించారు. అనంతరం వేదిక దిగుతుండగా ఎడమ కాలు జారి ముందుకు తూలిపడబోతూ.. షర్మిల తనను తాను నిలువరించుకున్నారు. ఈ ప్రయత్నంలో కుడి మోకాలు చిప్పకు మెట్లు బలంగా గుద్దుకున్నాయి. తీవ్ర నొప్పితో ఆమె విలవిల్లాడిపోయారు. కొద్ది నిమిషాల పాటు ఆమె అక్కడే కూర్చుండిపోయారు. డాక్టర్ హరికృష్ణ ఆమెకు ప్రథమ చికిత్స చేశారు. కాలు నొప్పిని లెక్క చేయకుండా ఆమె బీఎన్‌రెడ్డి నగర్ నుంచి ఇంజాపూర్ వరకు 4 కి.మీ. నడిచి అక్కడ బస చేశారు. ఉదయానికి నొప్పి మరింత తీవ్రమవడంతో వైద్యులు పరీక్షించి యాత్ర కొన్ని రోజులు వాయిదా వేసుకోవాలని సూచించారు. శనివారం షర్మిలను పరామర్శించిన వారిలో పార్టీ నాయకులు శోభానాగిరెడ్డి, సుజయకృష్ణ రంగారావు, ఆళ్ల నాని, రాజ్‌ఠాకూర్, రెహ్మాన్, దేప భాస్కర్, సురేఖ, పెన్మత్స సాంబశివరాజు, సామినేని ఉదయభాను, పుత్తా ప్రతాప్, వెల్లాల రాంమోహన్, వడ్డేపల్లి నర్సింగ్‌రావు, అమృతాసాగర్ తదితరులున్నారు.

Friday, December 14, 2012

సత్యం జయిస్తుంది...

జగన్‌ను విడిపిస్తుంది
రాజన్నాయని పిలిచినవారే - రాక్షసులైనారు నేడు
రాజన్న వలన మేలు పొందినవారే
రాతిగుండె ప్రజలైనారు చూడు
రాజశేఖరుడని పొగిడిన వారే
రాబందులై పొడుచుకుతింటున్నారు
దిక్కులేని పక్షులుగా మమ్మల్ని వదిలేసి
చుక్కల్లో నీవు కలిసి పోయినవేళ
సొమ్మసిల్లింది సామాన్యుడి హృదయం
నిర్జీవమైంది నిరుపేదల జనజీవనం
ఇపుడు మాకున్న ఒకే ఒక దిక్కు
పేదలను అక్కున చేర్చుకొని ఓదార్చిన జగన్!
పగవారి కుట్రలకు గురయిన జగన్!
పేదల మేలు తలచనివారు, పదవులకోసం తిరిగేవారు...
వారి దురాలోచనలన్నీ జగన్‌పై రుద్దుతున్నారు.
వారి కుతంత్రాలన్నీ జగన్‌కు ఆపాదిస్తున్నారు.

అయినా - చీకటి వెంట వెలుగు
కష్టం వెనుక సుఖం
మంచివారికి దేవుడిచ్చిన వరం
అందుకే - సత్యమే జయిస్తుంది.
నిజాయితీ నిలుస్తుంది.
ప్రజల గుండె స్పందిస్తుంది.
జగనన్నను విడిపిస్తుంది.
ఓటమి నుండి గెలిపిస్తుంది.
జననేతగా నిలబెడుతుంది.
- డా. కీర్తిలత, నక్కపల్లి, విశాఖ జిల్లా

సూర్యుడై వస్తున్నాడు..!




సూర్యుడై వస్తున్నాడు..
పోరాడే ధీరుడు ఎపుడూ.
పేదోళ్ల పెన్నిధి చూడు..
వైయస్‌ఆర్ వారసుడతడు.

నమ్మకానికతడే సుతుడు
నమ్ముకున్న వారికి హితుడు
విశ్వాసం అనే మాటకు
అక్షరాల కూర్పే అతడు

ప్రజలే తన ఐదో ప్రాణం
సహనమతని పంచమ వేదం
నియంతల మెడలను వంచే
దిగంతాల నాయకుడతడు

మాట తప్పని యోధుడు రేడు
మడమ తిప్పేవాడే కాడు
అవధులెన్ని ఏకం అయినా
వెన్ను చూపి పారే పోడు

విలువలకు వలువలు తొడిగి
శీలమన్న వెలుగులు పొదిగి
మాటకోసం మళ్లీ మళ్లీ
జన్మలెత్తి నిలుచుతాడు

ఇంటి ఇంటి గళమైనాడు
రైతు ఇంటి హలమైనాడు
పరుగులెత్తు జలమై పొంగి
పొలాలన్ని తడుపుతాడు

కష్టజీవి తోడైనాడు
నష్ట జీవి నీడైనాడు
లక్ష్యసాధనలో నేడు
లక్షలాది స్వరమైనాడు

అతని పలుకు మంగళవాద్యం
అతని పిలుపు ఆశల తీరం
అవని అంత హరితగ మారే
అతని దారి పుణ్యక్షేత్రం.

- వై.హెచ్.కె. మోహన్‌రావు,
అధ్యక్షుడు, పల్నాడు రచయితల సంఘం, పిడుగురాళ్ల, గుంటూరు జిల్లా

భరోసా ఏది?

దీంతో చదువుకోవాలన్న ఆశ ఉన్నా.. స్తోమత లేక ఇంట్లోనే ఉంటున్నారు
ప్రభుత్వ వైఖరి చూస్తూ కూడా చంద్రబాబు అవిశ్వాసం పెట్టనంటున్నారు
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ శుక్రవారం యాత్ర ముగిసేనాటికి.. రోజులు: 57, కిలోమీటర్లు: 824

 ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం విషయంలో విద్యార్థులకు భరోసా లేకుండా పోయిందని, ప్రభుత్వం తమ ఫీజులు కడుతుందో లేదోనన్న భయంతో చాలా మంది చదువులు మానేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల అన్నారు. ‘‘కొంతకాలం కిందట రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌కు చెందిన చ దువుల తల్లి వరలక్ష్మి అనే విద్యార్థిని ఫీజులు కట్టలేక ఆత్మహత్య చేసుకుంది. మరే విద్యార్థికీ ఇలాంటి దుస్థితి రాకుండా ఫీజుల బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలంటూ జగనన్న నాడు వారం రోజులు ఇందిరాపార్క్ వద్ద దీక్ష చేశారు. అయినా ఈ సర్కారుకు కనువిప్పు కలగలేదు. ఈ రోజు కూడా ప్రభుత్వం ఫీజుల పథకానికి తూట్లు పొడుస్తోంది. ఏ ఒక్క విద్యార్థికీ కూడా ఈ ప్రభుత్వం ఫీజులు కడుతుందనే భరోసా లేదు. ఎంతో మందికి చదువుకోవాలనే ఆశ ఉన్నా స్తోమత లేక, ప్రభుత్వం ఫీజులు కడుతుందన్న నమ్మకం లేక ఇంట్లో కూర్చుంటున్నారు’’ అని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, ప్రజాస్వామ్య విరుద్ధంగా దానితో కుమ్మక్కైన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర 57వ రోజు శుక్రవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, ఎల్బీనగర్ నియోజకవర్గాల్లో సాగింది. మార్గమధ్యంలో బడంగ్‌పేట్‌కు చెందిన ప్రణతి అనే విద్యార్థిని షర్మిలను కలిసి తాను ఎంబీఏ చదువుతున్నానని, ప్రభుత్వం ఫీజులు కట్టకపోవడంతో మేనేజ్‌మెంట్ తమపై ఒత్తిడి తెస్తోందని తెలిపింది. డబ్బులు కట్టే స్తోమత లేదని, ఇక చదువు మానేసి ఇంట్లోనే కూర్చోవాల్సిన పరిస్థితంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఆమెకు ధైర్యం చెప్పిన షర్మిల అనంతరం హయత్‌నగర్ మండలం బీఎన్‌రెడ్డి నగర్‌లో ప్రసంగిస్తూ పై వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబుకు మనసు రాలేదు..

‘‘రంగారెడ్డి జిల్లాలో నేను మర్చిపోలేని మరో సంఘటన ఉంది. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో రంగారెడ్డి జిల్లాకు చెందిన అనురాధ అనే మహిళపై యాసిడ్ దాడి జరిగింది. ఆమె వైద్యం చేయించుకోవడానికి ఏడాది పట్టింది. ఆపరేషన్ తరువాత ఆపరేషన్ అంటూ ఏడాది మొత్తం వైద్యంతోనే నడిచింది. అనురాధకు సహాయం చేసి అండగా నిలబడటానికి చంద్రబాబుకు మనసు రాలేదు. ఆమెకు వైద్యసాయం అందించాలని విద్యార్థులు ధర్నాలు చేసినా చంద్రబాబు చలించలేదు. 

పభుత్వ సహాయం కోసం అనురాధ హైకోర్టుకు వెళ్లింది. హైకోర్టు ఆయనకు మొట్టికాయ వేసి వైద్య ఖర్చుల కింద రూ. 5 లక్షలు చెల్లించాలని, ఆమెకు ఉద్యోగం కల్పించాలని తీర్పు చెప్పింది. ఎవరికైనా ఇలాంటి సమస్య వస్తే ముఖ్యమంత్రి అనేవారు మానవతా దృక్పథంతో స్పందించాలి. చంద్రబాబుకు మానవత్వం అనేదే లేదు’’ అని షర్మిల నిప్పులు చెరిగారు. ‘‘అనురాధకు అనుకూలంగా హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు సుప్రీంకోర్టుకు వెళ్లారు. అనురాధ ఒక్క మాట చెప్పింది.. ‘నాపై యాసిడ్ దాడి కంటే సర్కారు వ్యవహరించిన తీరే నన్ను చాలా బాధపెట్టింది’ అని ఆవేదన వ్యక్తం చేసింది.’’ అని అన్నారు. వైఎస్సార్ సీఎం కాగానే ఆమెకు ఆర్థిక సాయం గా రూ.70లక్షలు, ఉద్యోగం ఇచ్చారని, ప్రస్తుతం ఆమె రీసెర్చ్ సైంటిస్టుగా పనిచేస్తోందని షర్మిల తెలిపారు. ప్రజలను పీడించిన చంద్రబాబు, ప్రతిపక్ష నాయకుడిగా కూడా విఫలమయ్యారన్నారు. ప్రజలు పట్టని ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టి దించేయాల్సిందిపోయి.. దానితోనే కుమ్మక్కై ప్రజలనే గాలికి వదిలేశారని విమర్శించారు.

పోటెత్తిన జనం..

పాదయాత్ర 57వ రోజు నాదర్‌గుల్ నుంచి నడక ప్రారంభించిన షర్మిల బడంగ్‌పేట్, మీర్‌పేట్ మీదుగా యాత్ర చేశారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని బీఎన్‌రెడ్డి నగర్‌కు ఆమె వచ్చే సరికి జనం కిక్కిరిసిపోయారు. వారిని ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు. అక్కడి నుంచి రాత్రి 8 గంటలకు ఇంజాపూరు శివారులో ఏర్పాటు చేసిన బసకు చేరుకున్నారు. శుక్రవారం మొత్తం 16.30 కిలోమీటర్ల మేర యాత్ర సాగింది. ఇప్పటి వరకు మొత్తం 824 కిలోమీటర్ల యాత్ర పూర్తయ్యింది. షర్మిల వెంట పాదయాత్రలో నడిచిన నేతల్లో ఎమ్మెల్యేలు కె.శ్రీనివాసులు, శోభానాగిరెడ్డి, బాలరాజ్, రాజేష్, మాజీ ఎంపీ బుచ్చి మహేశ్వర్‌రావు, రాజ్‌ఠాకూర్, జనక్ ప్రసాద్, బాజిరెడ్డి గోవర్ధన్, పుత్తా ప్రతాప్, బెక్కరి జనార్ధన్‌రెడ్డి, దేప భాస్కర్, దేప సురేఖ, సింగిరెడ్డి ధన్‌పాల్, వాసిరెడ్డి పద్మ, తలశిల రఘురాం, ఆదం విజయ్‌కుమార్, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, డాక్టర్ శివభారత్, జిట్టా, రవీంద్ర నాయక్, జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్ సురేశ్‌రెడ్డి, వంగా మధు తదితరులు పాల్గొన్నారు.

Thursday, December 13, 2012

ప్రజల్లోకి వెళ్లగల నైతిక ధైర్యం ఒక్క జగన్‌కే ఉంది




రాజకీయ నాయకుడంటే ప్రజా సమస్యలని తన సమస్యలుగా భావించి, వాటికి పరిష్కారం చూపేవాడు. కానీ ప్రస్తుతం ఉన్న నాయకులంతా అసలు ప్రజలు ఏం ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకోకుండా సమయాన్నంతా తమ పైరవీలకే వృథా చేస్తున్నారు. రాజశేఖరరెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అసలైన నాయకుడు అనిపించుకున్నారు. రాష్ట్రం రకరకాల సమస్యలతో ఉన్నప్పుడు, తమ గోడు ఎవరికి చెప్పాలో అర్థంకాక ప్రజలంతా దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు వైయస్సార్ గారు నేనున్నానంటూ ఎవరూ ధైర్యం చేయలేని విధంగా మండుటెండల్లో పాదయాత్రను చేపట్టి రాష్ట్రం నలుమూలలా ప్రజల సమస్యలు విన్నారు. ముఖ్యమంత్రి అయ్యాక - పాదయాత్రలో తను ఇచ్చిన ప్రతి వాగ్దానం నెరవేరుస్తూ ప్రజల మనసులను గెలుచుకున్నారు. ఆరోగ్యశ్రీ పేదల సంజీవని అయింది. దేశంలోనే ఈ సేవలను మొదలుపెట్టిన ముఖ్యమంత్రి వైయస్ గారే. 

ఆయన తపనంతా మనరాష్ర్టం సస్యశ్యామలంగా, ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలని! దురదృష్టవశాత్తూ ఆయన చనిపోయారు. అంతవరకూ వైయస్ గారిని ఆకాశానికెత్తినవారే, లబ్దిపొందిన నాయకులే తర్వాత మొహం చాటేశారు. ఇప్పుడు వారి కుటుంబంపై విమర్శలు చేయడమే ఆ నాయకులకు ప్రధమ కర్తవ్యం అయింది. అయితే వీళ్లు ఒక వాస్తవం తెలుసుకోవాలి. వైయస్ గారంటే గౌరవం ఉన్న ప్రతిఒక్కరు జగన్‌కు అండగా వుంటారు. అసలు ప్రజలలోకి వెళ్లగలిగే ధైర్యం మన రాష్ట్రంలో ఏ నాయకుడికైనా ఉందా? జగన్‌కు ప్రజల నుంచి వస్తున్న అపూర్వ స్పందన చూసి ఓర్వలేకే ఆయన్ను జైల్లో ఉంచారు. జగన్ బయటకు వస్తారు. ప్రజలకు తప్పకుండా మేలు చేస్తారు. 

జనానికి దగ్గరవడమేనా జగనన్న నేరం?


జగన్, జనం కలిస్తే ఇక ప్రభంజనమేనని పాలక కాంగ్రెస్ పార్టీకి తెలిసినట్లుంది. అందుకే జగనన్నని జనం నుంచి దూరం చేసింది. కానీ ప్రజాభిమానాన్ని మాత్రం ఆపలేకపోయింది. కారణం.. కాంగ్రెస్ కుటిల రాజకీయం ప్రజలకు తెలిసిపోవడమే. ఉదయించే సూర్యుణ్ణి అరచేతితో ఆపలేరన్నది ఎంత సత్యమో ‘హస్త’మించే కిరణాలకు ఉదయించే శక్తి లేదన్నది అంతే నిజం. 2003 వరకు దిక్కుతోచని స్థితిలో ఉన్న అన్నదాతలకు పెద్దదిక్కయ్యాడు రాజన్న. ఆయన లేని లోటు పూడ్చడానికి, రాజన్న వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నాడు జగనన్న. 

అటువంటి జగనన్న ఏం తప్పు చేశారని జైల్లో పెట్టారు? ప్రజల కష్టాలు తెలుసుకోవడం, అన్నదాతల కళ్లల్లో ఆనందం చూడాలనుకోవడం ఆయన చేసిన తప్పా? రాజన్న ఇకలేరని తెలిసి గుండెపగిలి చనిపోయిన వ్యక్తుల కుటుంబాలను ఓదార్చడం పాపమా? అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని నెలల తరబడి జైల్లో పెట్టడమే మన చట్టమైతే తొమ్మిదేళ్లు రాష్ట్రాన్ని పాలించి స్విస్, సింగపూర్, మలేషియా బ్యాంకుల్లో నల్లధనాన్ని దాచాడన్న ఆరోపణలున్న చంద్రబాబును ఎన్నేళ్లు జైల్లో పెట్టాలి? డిఎల్‌ఎఫ్ కుంభకోణంలో ‘హస్త’ముందన్న ఆరోపణలు ఎదుర్కొన్న సోనియాగాంధీ అల్లుడు రాబర్డ్ వాద్రాను ఎందుకు జైలుకు పంపలేదు? 

లక్షలకోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ, 2జి, బొగ్గు లాంటి కుంభకోణాల్లో ఇరుక్కున్న కేంద్రమంత్రులను ఎందుకు జైల్లో పెట్టలేదు? అయినవారు అవినీతిపరులైనా అక్కువ చేర్చుకుని అందలమెక్కించడం, కానివారు నీతిమంతులైనా జైల్లో పెట్టించడం... ఇదేనా కాంగ్రెస్ ప్రజాస్వామ్యానికి అర్థం. అధికారాన్ని అడ్డం పెట్టుకుని నిర్లజ్జగా తప్పుడు పనులు చేసిన నాయకులు స్వేచ్ఛగా బయట తిరుగుతుంటే, ప్రజాసేవే పరమావధిగా అహర్నిశలు కృషిచేసిన జగనన్నను మాత్రం నాలుగు గోడల మధ్య బంధించడం ఎంతవరకు సమంజసం? ఒక్కటి మాత్రం నిజం.. ప్రజలు అంతా గమనిస్తున్నారు. దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్న నాయకులకు ప్రజలే గుణపాఠం చెప్పేరోజు దగ్గరలోనే ఉంది. వారంతా రాజన్న రాజ్యంకోసం, 2014 ఎన్నికలకోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

- ఎం.ఎస్.కె. సాగర్, హైదరాబాద్
Related Posts Plugin for WordPress, Blogger...