టీడీపీ అధినేత చంద్రబాబుకు షర్మిల ప్రశ్న
ప్రతి ఆడ శిశువుకు రూ.5 వేలు డిపాజిట్ చేసి, ఉచితంగా చదివిస్తామన్న మీ మాట ఏమైంది?
మీ తొమ్మిదేళ్ల పాలనలో నాలుగంటే.. నాలుగు లక్షల మందికి మీరు డిపాజిట్ చేశారు
ఇప్పుడు పల్లెల్లో మీరు తిరిగినప్పుడు.. కూలీలుగా కనిపిస్తున్న ఆడబిడ్డలను
చూసినప్పుడైనా మీకు బాధ అనిపించలేదా?
ఏ మాటా ఇవ్వకున్నా వైఎస్ ఆ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేశారు
రూ.5 వేలు కాదు.. తొలిచూరు ఆడబిడ్డకు రూ. 1,00,000 వేశారు
రెండో ఆడపిల్ల పుడితే మరో రూ.30,000 చొప్పున డిపాజిట్ చేశారు
మహానేత మరణించాక రైతులు దిక్కులేక ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి
రైతుల గోడు వినిపించని ఈ ప్రభుత్వం ఉందా? చచ్చిందా?
ఇంత జరుగుతున్నా చంద్రబాబు ఈ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టరట..
కాంగ్రెస్తో ఆయన కుమ్మక్కయ్యారు కాబట్టే అవిశ్వాసం పెట్టనంటున్నారు
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ శుక్రవారం యాత్ర ముగిసేనాటికి.. రోజులు: 44, కిలోమీటర్లు: 606
‘‘చంద్రబాబు నాయుడు గారూ.. సడన్గా మీరు పాదయాత్ర అంటూ పల్లెల వెంట తిరుగుతున్నారు. రకరకాల హామీలు ఇస్తున్నారు. మీరు అధికారంలోకి రావడానికి ముందు ఎన్నికల్లో మీరొక వాగ్దానం చేశారు. పుట్టిన ప్రతి ఆడబిడ్డకు రూ.5 వేలు డిపాజిట్ చేస్తామని, ఆ ఆడబిడ్డ చదివినంత వరకు ఉచితంగా చదివిస్తామని స్వయంగా మీరే మాటిచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఎంత మంది అడపిల్లలకు ఉచిత విద్య అందించారు? మొత్తం మీ తొమ్మిదేళ్ల పాలనలో కేవలం నాలుగంటే నాలుగు లక్షల మందికి రూ.5 వేల చొప్పున మీరు డిపాజిట్ చేశారు.
అయ్యా.. చంద్రబాబు గారూ.. ఆ పల్లెల వెంట తిరుగుతున్నప్పుడు.. కూలీలుగా పనులు చేసుకొంటున్న ఆడబిడ్డలను చూసినప్పుడైనా ‘అయ్యో..! ఆ వేళ మాట ఇచ్చి తప్పించుకున్నానే.. ఆ ఆడబిడ్డల ఉసురు నాకు తగులుతుందే’ అని మీ మనసుకు ఒక్క సారంటే ఒక్కసారైనా అనిపించలేదా?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల.. టీడీపీ అధినేత చంద్రబాబును నిలదీశారు. ‘‘అదే మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఎలాంటి వాగ్దానం చేయకుండానే మీ కంటే గొప్పగా ఆ పథకాన్ని అమలు చేశారు. కుటుంబంలో తొలిచూరు ఆడపిల్ల జన్మిస్తే రూ.1,00,000, రెండో ఆడపిల్ల పుడితే రూ.30,000 చొప్పున డిపాజిట్ చేశారు. ఆయన సువర్ణ పాలనలో మొత్తం ఐదున్నర లక్షల మంది చిన్నారుల పేరు మీద ఇలా డిపాజిట్ చేశారు. నా చిట్టి తల్లులు పెరిగి పెద్దవారైతే పెళ్లీడు వచ్చే నాటికి మూడున్నర లక్షల రూపాయల నుంచి నాలుగు లక్షల రూపాయల వరకు నగదు చేతికి వస్తుంది’’ అని షర్మిల గుర్తుచేశారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో కుమ్మక్కయిన చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర 44వ రోజు శుక్రవారం మహబూబ్నగర్ జిల్లాలోని మక్తల్ నియోజకవర్గంలో సాగింది. ఆమె అడుగులో అడుగు వేస్తూ కదం తొక్కేందుకు ఆత్మకూరు మండల
కేంద్రానికి భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చారు. వారిని ఉద్దేశించి షర్మిల ప్రసంగిస్తూ పై వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వం బతికే ఉందా? చచ్చిందా?
‘‘నిన్న(గురువారం) రాత్రి నేను పాదయాత్ర ముగించే సమయంలో పెద చెన్నయ్య అనే రైతు నా వెంట నడిచాడు. ‘అక్కా.. వైఎస్సార్ నాకు కన్న తండ్రి లాగా ఉన్నాడు. పోయిన ఏడాది పత్తి పంట వేశాను. అది చేతికి రాలేదు. ఇప్పుడు పత్తితోపాటు వేరుశనగ కూడా వేశాను. అది కూడా వస్తుందో రాదో తెలీదు. రూ. 3 లక్షలు అప్పుల పాలయ్యాను. నాన్న ఉన్నప్పుడు నా అప్పులన్నీ తీర్చేశాడు. ఇప్పుడు నాకు ఆ పరిస్థితి లేదక్కా..’ అని చెప్పినప్పుడు ఒక పక్క బాధ అన్పించింది. మరోవైపు నాన్న గారు రైతుల హృదయాల్లో ఇంతలా గూడు కట్టుకున్నారని సంతోషపడ్డాను. నాన్న పోయాక రైతులు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకోవాల్సిన దుస్థితి.. లేకుంటే ఉన్న భూములను అమ్ముకోవాల్సిన పరిస్థితి దాపురించింది. రైతుల గోడు పట్టించుకోని ఈ ప్రభుత్వం బతికి ఉందా లేదా చచ్చిందా’’ అని షర్మిల ధ్వజమెత్తారు.
చంద్రబాబు అవిశ్వాసం పెట్టనంటున్నారు..
‘‘నేను గ్రామాల వెంట వెళ్తున్నప్పుడు చాలా మంది అక్కా చెల్లెమ్మలు ‘మాకు తాగునీళ్లు కూడా లేవు. చేసుకోవడానికి కూలి పనులు కూడా దొరకడం లేదు. పసి పిల్లలను ఇంటి దగ్గర వదిలిపెట్టి బతుకు దెరువు కోసం వలసలు వెళ్తున్నా’మని చెప్తున్నారు. ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉంటే పట్టించుకోని ఈ ప్రభుత్వాన్ని నిలదీసి ప్రజల సమస్యలు తీర్చేలా చేయాల్సిన ప్రతిపక్ష నేత చంద్రబాబు.. అధికార పక్షంతోనే కుమ్మక్కయ్యారు’’ అని షర్మిల టీడీపీ అధినేతను తూర్పారబట్టారు. ‘‘చంద్రబాబుకు మాట మీద నిలబడటం అంటే ఈ జన్మలో తెలీదు. తొమ్మిదేళ్లలో ఎనిమిదిసార్లు కరెంటు చార్జీలు పెంచి వాటిని కట్టమని రైతులపై ఒత్తిడి తెచ్చాడు. కరువు వచ్చింది.. తినటానికే తిండి గింజలు లేవు.. ఇప్పుడు బిల్లులు కట్టలేం మహాప్రభో అని రైతులు మొరపెట్టుకున్నా చంద్రబాబు వినలేదు. అప్పుడు రాజన్న ప్రతిపక్షంలో ఉన్నారు. ఆయన పదవి ఉన్నా లేకపోయినా రైతులకు అండగా నిలబడ్డారు. అదే బాబు రైతులు కరెంటు బిల్లులు కట్టలేదని వారింట్లో సామాను లాక్కున్నారు. కేసులు పెట్టించారు. ఇంట్లో మగవారు లే నిపక్షంలో ఆడవారిని పోలీస్ స్టేషన్లో పెట్టారు. బకాయిలు కట్టలేక, అవమానం తట్టుకోలేక 4 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇది మరిచిపోలేని విషయం. ఈ పాపం బాబుది కాదా?’’ అని నిలదీశారు.
బాబు శ్మశానాలుగా మార్చిన గ్రామాల్లోనే..
‘‘చంద్రబాబు పాదయాత్ర అని ఇప్పుడు కొత్తగా డ్రామాలు ఆడుతున్నారు. తన తొమ్మిదేళ్ల పాలనలో శ్మశానాలుగా మార్చిన గ్రామాల మీది నుంచే ఇప్పుడు ఆయన పాదయాత్ర చేస్తున్నాడు. ప్రజలకు తెలుసు.. మాట మీద నిలబడటం అంటే చంద్రబాబుకు ఈ జన్మలో అర్థం కాదు. పాదయాత్ర చేయాల్సిన అవసరమే ఆయనకు లేదు. ఆయనకు తగినంత మంది ఎమ్మెల్యేల బలం ఉంది. అవిశ్వాసం పెట్టి ఈ ప్రభుత్వాన్ని దించవయ్యా చంద్రబాబు అంటే అవిశ్వాసం పెట్టనంటే పెట్టనంటున్నారు. ప్రభుత్వంతో కుమ్మక్కయ్యారు కాబట్టే ఆయన అవిశ్వాసం పెట్టనంటున్నారు’’ అని షర్మిల విమర్శించారు.
షర్మిలకు నేతల సంఘీభావం
మహబూబ్నగర్, న్యూస్లైన్ ప్రతినిధి: షర్మిలకు సంఘీభావంగా వైఎస్సార్ కాంగ్రెస్కు చెందిన పలువురు నాయకులు శుక్రవారం పాదయాత్రలో పాల్గొన్నారు. వారిలో ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు బాజిరెడ్డి గోవర్ధన్, బాల మణెమ్మ, ఆది శ్రీనివాస్, జ్యోతుల నెహ్రూ, రోజా, వాసిరెడ్డి పద్మ, ఎడ్మ కిష్టారెడ్డి, స్వర్ణ సుధాకర్రెడ్డి, రెడ్డిగారి రవీందర్రెడ్డి, తలశిల రఘురాం, కాపు భారతి, వర్కటం జగన్నాథరెడ్డి, రాకేష్రెడ్డి, యాపర్ల మహేశ్వరమ్మ, కందూరి లక్ష్మి, కోట్ల హరిచక్రపాణిరెడ్డి, తిరుమల రెడ్డి, రావుల రవీంద్రనాథ్రెడ్డి, గౌరారం వెంకటరెడ్డి తదితరులున్నారు.
షర్మిలకు అల్లీపురంలో ఆత్మీయ స్వాగతం
షర్మిల పాదయాత్ర శుక్రవారం రాత్రి ఆత్మకూరు మీదుగా అల్లీపురంవైపు సాగింది. ఇక్కడ కొంత మంది యాత్రకు ఆటంకం కలిగించే ప్రయత్నం చేశారు. విషయం దావానలంలా గ్రామంలో వ్యాపించడంతో ప్రతి ఇంటి నుంచీ మహిళలు బయటికి వచ్చారు. షర్మిలకు అండగా నిలబడ్డారు. ఆమెకు హారతి పట్టి ఆహ్వానించారు. రైతులు కూడా అండగా కదలిరావడంతో అల్లీపురం చౌరస్తా జనంతో కిటకిటలాడింది. ప్రజలను చూసి ఆ ఆందోళనకారులు తమ ప్రయత్నం విరమించుకున్నారు. మహిళలు తోడు ఉండి గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస వరకు షర్మిలను సాగనంపారు. 44వ రోజు శుక్రవారం ఉదయం మూలమల్ల శివారు నుంచి మొదలైన యాత్ర ఆత్మకూరు మీదుగా రాత్రి 8 గంటలకు అల్లీపురం చేరింది. శుక్రవారం మొత్తం 17 కిలోమీటర్ల మేర షర్మిల నడిచారు. ఇప్పటివరకు మొత్తంగా 606 కిలోమీటర్ల మేర పాదయాత్ర పూర్తయింది.
‘యువకిరణాలు’ ఎటు పోతున్నాయ్
మూలమల్ల గ్రామంలో షర్మిల నిర్వహించిన రచ్చబండలో ఓ అంధ విద్యార్థి మాట్లాడుతూ.. ‘‘నా పేరు నవీన్. వికలాంగుడిని.. డిగ్రీ, డీఎడ్ పూర్తి చేశాను. నా సోదరి కూడా వికలాంగురాలు. వికలాంగులకు మూడు శాతం రిజర్వేషన్ ఉంది కానీ అది సరిగా అమలు కావడం లేదు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్రెడ్డి రాజీవ్ యువకిరణాలతో నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని చెప్పారు. మాకు ఇంతవరకు ఏ ఉపాధీ చూపించ లేదు. పైరవీకారుల ఇంటికి యువ కిరణాలు చేరుతున్నాయక్కా’’ అని చెప్పుకొచ్చారు. షర్మిల స్పందిస్తూ జగనన్న రాగానే వికలాంగులు చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునేందుకు రుణాలు ఇప్పించి ప్రోత్సహిస్తారని భరోసా ఇచ్చారు.