Wednesday, February 6, 2013

మోకాలి నొప్పి బాధపెడుతున్నా..


కళ్ల ముందు సుదీర్ఘ ప్రయాణం.. కానీ కాలు కదిపితే నొప్పి.. అయినా ఆమె మోకాలి నొప్పిని పంటి బిగువున అదిమిపట్టారు.. ఆత్మ విశ్వాసంతో తొలి అడగు వేశారు.. ప్రజలు పట్టని ప్రభుత్వ వైఖరినీ, దానితో కుమ్మక్కయిన ప్రధానప్రతిపక్షాన్నీ జనంతో కలిసి నిలదీసేందుకు ముందుకు నడిచారు. అమ్మా, వదిన తోడు రాగా షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ బుధవారం పునఃప్రారంభమైంది. షర్మిలకు తోడుగా జనం కదలి వచ్చారు.. ఆమె అడుగులో అడుగేశారు. ‘మేమున్నాం నడువమ్మా’ అంటూ ధైర్యం చెప్పారు. తొలి అడుగు మరో అడుగై.. తొలిరోజు ఏక బిగిన ఆమె 15.5 కిలో మీటర్లు నడిచారు.

షర్మిల ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని తమ నివాసం నుంచి బయలుదేరారు. ఈ సందర్భంగా ఆమెను ఆశీర్వదిస్తూ సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం షర్మిల నుదుట విజయమ్మ ముద్దుపెట్టి ముందుకు సాగనంపారు. 10.30 గంటలకు షర్మిల రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్ సమీపంలోని ఎస్‌ఎస్‌ఆర్ గార్డెన్స్‌కు చేరుకున్నారు. 

మోకాలి గాయం కారణంగా డిసెంబరు 15న ఆమె పాదయాత్ర నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది ఇక్కడే. సరిగ్గా 11.01 గంటలకు షర్మిల పాదయాత్రను మొదలుపెట్టారు. తల్లి వైఎస్ విజయమ్మ, వదిన వైఎస్ భారతి తోడుగా వచ్చి తుర్కయాంజాల్ వరకు ఆమెను సాగనంపారు. మోకాలి నొప్పి బాధపెడుతున్నా.. మధ్య మధ్యలో మోకాలి పట్టీని గట్టిగా బిగించి కట్టుకుంటూ ఆమె ముందుకు సాగారు. ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ చంద్రశేఖరరెడ్డి కూడా ఆమెతో పాటు నడుస్తూ వైద్య సేవలు అందించారు. ‘జాగ్రత్త బిడ్డా.. ఎండలు ఎక్కువైంది.. మెల్లగా నడువు.. అన్నను బయటికి తెచ్చే వరకు ఆగకు బిడ్డా’ అని తుర్కయాంజాల్ గ్రామానికి చెందిన వృద్ధురాలు దాసర్ల లింగమ్మ ఆమెకు జాగ్రత్తలు చెప్పారు. ఈ ఆత్మీయ పలకరింపులు.. ఆశీస్సులు.. దారి పొడవునా కొనసాగాయి.

కరెంటు బిల్లు కట్టలేం..
మార్గం మధ్యలో షర్మిల తుర్కయాంజాల్‌లో రచ్చబండ వద్ద గ్రామస్థులతో మాట్లాడారు. కరెంటు బిల్లు కట్టలేమని.. ఈ సర్కారును కూలగొట్టమని పాపమ్మ అనే వృద్ధురాలు ఈ సందర్భంగా షర్మిలకు మొరపెట్టుకున్నారు. బొంగులూరు గేటు వద్ద పోచారం గ్రామానికి చెందిన జంగయ్య యాదవ్ షర్మిలకు గొర్రెపిల్లను బహుకరించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డితోటే మా గొల్లల బతుకులు పోయినయ్ బిడ్డా అని ఆయన కన్నీరు మున్నీరుగా విలపించాడు. రమేష్ అనే వికలాంగుడు షర్మిలతో మాట్లాడుతూ.. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో తనకు బతుకు భారమైందంటూ కన్నీళ్లు పెట్టాడు. 

ఆయనకు ధైర్యం చెప్పి ఆమె ముందుకుసాగారు. రాగన్నగూడ, మన్నెగూడ మీదుగా షర్మిల శేరిగూడ చేరుకున్నారు. ఇక్కడ ఇంజనీరింగ్ విద్యార్థులు వచ్చి కలిసి షర్మిలకు సంఘీభావం ప్రకటించారు. తర్వాత ఇబ్రహీంపట్నం చేరిన ఆమె ఇక్కడ వైఎస్సార్ విగ్ర హాన్ని ఆవిష్కరించారు. ఓ దంపతుల కోరిక మేరకు వారి పాపకు విజయమ్మ అని నామకరణం చేశారు. తర్వాత పెద్ద ఎత్తున తరలివచ్చిన జన ప్రవాహాన్ని ఉద్దేశించి బహిరంగ సభలో ప్రసంగించారు. అక్కడి నుంచి 1.5 కిలో మీటర్లు ప్రయాణించిన తరువాత శాస్తా గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి ఆమె చేరుకున్నారు. పాదయాత్ర మలివిడత తొలిరోజు (58వ రోజు) మొత్తం 15.5 కిలోమీటర్ల దూరం ఆమె ప్రయాణించారు.

పాదయాత్రలో ప్రముఖులు
షర్మిలకు సంఘీభావంగా పాద యాత్రకు పలువురు ప్రముఖులు తరలివచ్చారు. ఎమ్మెల్యేలు శోభానాగిరెడ్డి, గురునాథ్‌రెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, మేకతోటి సుచరిత, మద్దాలి రాజేష్, పార్టీ నాయకులు వైవీ సుబ్బారెడ్డి, కొండా సురేఖ, కేకే మహేందర్‌రెడ్డి, బెక్కరి జనార్ధన్, రాజ్‌ఠాకూర్, పుత్తా ప్రతాప్, దేప భాస్కర్, బాజిరెడ్డి గోవర్ధన్, ఎంవీఎస్ నాగిరెడ్డి, కె. శివకుమార్, చల్లా మధుసూదన్‌రెడ్డి, వాసిరెడ్డి పద్మ, పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి తదితరులు యాత్రలో పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...