Monday, February 11, 2013

How to.... Why to.... Live?

నల్లగొండ జిల్లా పాదయాత్రలో షర్మిలకు ఫ్లోరైడ్ బాధితుల మొర

ఎందరో వచ్చి పరామర్శించినా తమ బతుకులు బాగుచేయలేకపోయారని ఆవేదన
వైఎస్ ఒక్కరే తమ కోసం కృష్ణా జలాలు తెచ్చారని వెల్లడి 
ఇప్పుడు తమకు దిక్కెవరూ లేకపోయారంటూ కన్నీళ్లు
వారి కష్టాలు విని కన్నీళ్లు పెట్టుకున్న షర్మిల 
ఫ్లోరైడ్ బాధితులకు జగనన్న అండగా నిలబడతారని భరోసా
వైఎస్సార్ మృతితో మధ్యలో ఆగిపోయిన పథకాలను పూర్తి చేస్తారని హామీ
కాంగ్రెస్ పార్టీ గ్రీన్‌సిగ్నల్ ఇస్తేనే చంద్రబాబు అవిశ్వాసం డ్రామా ఆడతారంటూ ధ్వజం
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ ఆదివారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 62 కిలోమీటర్లు: 897.2
 నీళ్లు ప్రకృతి ఇచ్చిన వరం.. మోడువారిన మొక్కకు దోసెడు నీళ్లు పోస్తే చిగురిస్తుంది. ఇదేం పాపమో.. నల్లగొండ పల్లెల్లో ప్రకృతిచ్చిన నీళ్లే పసిమొగ్గల బతుకులు చిదిమేస్తున్నాయి. 70 ఏళ్లుగా గర్భ శోకాన్ని నింపుతున్నాయి. చెంగు చెంగున ఆటలాడాల్సిన పిల్లలను ఫ్లోరైడ్ భూతం కబళించడంతో వారు జీవచ్ఛవాల్లా ఇంటి ముందు పడి ఉంటే చూడలేక తల్లిదండ్రుల గుండె పగులుతోంది. కాళ్లు, చేతులు వంకర్లుపోయి.. అంగవైకల్యం.. మానసిక వైకల్యంతో కుంగిపోతున్న ఫ్లోరైడ్ పీడితులు ఇంటికొకరు ఉన్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు నల్లగొండ జిల్లాలో 75 వేల మందిని ఫ్లోరైడ్ రక్కసి నమిలేసింది. ‘మరో ప్రజాప్రస్థానం’లో భాగంగా ఈ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న షర్మిల.. ఆదివారం ఫ్లోరైడ్ బాధితులను కలిసి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఫ్లోరోసిస్ వ్యాధి పీడితుల్ని చూసి చలించిపోయారు. ఈ బతుకు మరెవరికీ రాకూడదమ్మా అంటూ వారు చెప్పుకొన్న కష్టాలు విని విలవిల్లాడిపోయారు. ‘ఇన్నాళ్లూ పేపర్లు, టీవీల్లో చూడడమేగాని.. సమస్య ఇంత దారుణంగా ఉందని తెలియదు’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

దిక్కులేక.. అవే నీళ్లు..:
ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో అంటకాగుతున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున సోదరి షర్మిల చేపట్టిన పాదయాత్ర ఆదివారం నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడెం మండల గ్రామాల్లో కొనసాగింది. దాదాపు 15 కిలోమీటర్లు సాగిన ఈ యాత్రలో దారిపొడవునా ఫ్లోరైడ్ బాధితులు ఉండటాన్ని గమనించిన షర్మిల సరంపేట గ్రామం రచ్చబండలో వారితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇక్కడ తాగే నీళ్లలో సగటున 8 పీపీఎం(పార్ట్ పర్ మిలియన్) ఫ్లోరైడ్ ఉందని, ఈ నీళ్లు తాగటానికి ఎంత మాత్రం పనికిరావని 1940లోనే తేలిందని, తెలిసి కూడా మరో దిక్కు లేక ఇక్కడి ప్రజలు ఈ నీళ్లనే తాగుతున్నారని స్థానిక నాయకులు షర్మిలకు వివరించారు.

వైఎస్ ఒక్కరే ఆదుకునే ప్రయత్నం చేశారు: ‘‘అమ్మా.. నిజాం ప్రభువు కాలం నుంచి ఇప్పటి కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వం వరకు ప్రతి ఒక్కరు ఫ్లోరైడ్‌బాధితుల కష్టాలను చూశారు. మా మీద జాలి చూపారు. ఆదుకుంటామన్నారు. మళ్లీ మొహం చూపించలేదు. చంద్రబాబు నాయుడు... చిరంజీవి తమ్ముడు పవన్‌కల్యాణ్.. నాదెండ్ల మనోహర్.. వేరే దేశాలోళ్లు చాలా మంది వచ్చిపోయారు. ఒక్క వైఎస్సార్ మినహా మరే నేత కూడా మమ్మల్ని ఆదుకునే ప్రయత్నమే చేయలేదమ్మా’’ అని ఫ్లోరోసిస్ వ్యాధి బాధితులు పొనుగంటి తిరుపతమ్మ, అంశల స్వామిలు తమ గోడు చెప్పుకొన్నారు. ‘‘ఈ బతుకు ఎవ్వరికీ రావొద్దక్కా... రెండు సార్లు ఆత్మహత్యకు ప్రయత్నించాను. ఆరో తరగతి వరకు బాగానే ఉన్నాను. అందరి పిల్లల మాదిరిగానే నడిచాను.. పరిగెత్తాను. ఏడో తరగతిలో కాళ్లు మెలి తిరిగిపోయినయి. భరించలేనంత నొప్పి.. నా బాధలు చూడలేక అమ్మ చనిపోయింది. 10వ తరగతి పరీక్షలు రాయలేకపోయాను. ఇప్పుడు నా వయసు 33 ఏళ్లు. నా వ్యాధి ఇంకొకరికి రావొద్దక్కా.. మా పల్లెలకు నీళ్లు తెప్పించండి’’ అని తిరుపతమ్మ షర్మిలతో చెప్పి కన్నీళ్లు పెట్టింది.‘‘రాష్ట్రపతిని కలిసి మా గోడు చెప్పుకున్నా మా కష్టం తీరలేదక్కా... వైఎస్సార్ తీర్చాడు. పల్లెలకు కృష్ణా నీళ్లు తెచ్చాడు’’ అని కుదాసిపేటకు చెందిన 33 ఏళ్ల రజిత వెల్లడించింది. 

కన్నీరు పెట్టిన షర్మిల..: ‘‘మా చెల్లెకూ ఫ్లోరోసిస్ వ్యాధి ఉంది.. నాకూ వచ్చింది.. అమ్మ చెల్లెను, నన్ను చూసి తట్టుకోలేకపోయింది. పిచ్చిదైపోయింది.. నాన్న నన్ను చూసుకున్నాడు కానీ చెల్లెను చూసుకోవాల్సిన అమ్మకు మతిస్థిమితం లేకపోవడంతో 11 ఏళ్ల వయసున్న నా చెల్లి చనిపోయింది’’ అంటూ అంశల స్వామి బిగ్గరగా ఏడ్చారు. వారి కష్టాలు విని షర్మిల కూడా కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. అనంతరం రచ్చబండలో ఆమె మాట్లాడుతూ.. ‘‘నల్లగొండ జిల్లా ప్రజలను వైఎస్సార్ ఎంతగానో ప్రేమించారు. ఈ ప్రాంత ప్రజలు ఫ్లోరైడ్ సమస్యతో బాధపడుతున్నారని, వాళ్లకు కృష్ణా జలాలు అందిస్తేనే అక్కడి ప్రజలు బతుకుతారని చె ప్పేవారు. ఈ జిల్లాలో 975 గ్రామాల్లో ఫ్లోరైడ్ సమస్య ఉంది. వైఎస్సార్ కంటే ముందు చాలా మంది ముఖ్యమంత్రులుగా ఉన్నారు. కానీ ఫ్లోరోసిస్ బాధితులను ఆదుకోవాలనే ఆలోచన ఒక్క వైఎస్సార్‌కే వచ్చింది. 

చంద్రబాబు నాయుడు ఎనిమిదేళ్లు ముఖ్యమంత్రిగా చేసి కేవలం రూ. 9 కోట్లు మాత్రమే ఫ్లోరైడ్ బాధితుల కోసం ఖర్చు చేశారు. అదే వైఎస్సార్ రూ.375 కోట్లు ఖర్చు చేసి 450 ఫ్లోరైడ్ పీడిత గ్రామాలకు కృష్ణా జలాలను అందించారు. మరో 525 గ్రామాలకు నీళ్లు అందించాల్సి ఉంది. ఈలోగా ఆయన మన మధ్య నుంచి వెళ్లిపోవడంతో ఈ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి’’ అని గుర్తుచేశారు. ‘‘ఇప్పుడున్న పాలకులకు మనసు లేదు. వీళ్లు చేయరు. నేను మీకు మాటిచ్చి చెప్తున్నా.. వైఎస్సార్ తనయుడిగా.. నాన్నగారు మధ్యలో వదిలేసి వెళ్లిపోయిన పనులను జగనన్న పూర్తి చేస్తారు. మిగిలిన 525 గ్రామాలకు మంచి నీళ్లు అందిస్తారు. త్వరలోనే జగనన్న వస్తారు.. తరతరాలుగా ఈ జిల్లాను పట్టి పీడిస్తున్న ఫ్లోరైడ్ రక్కసి నుంచి మిమ్మల్ని రక్షిస్తారు’’ అని భరోసా ఇచ్చారు.

కాంగ్రెస్ చెబితే చంద్రబాబు అవిశ్వాసం..: మార్గమధ్యంలో తనను కలిసి కన్నీరు పెట్టుకున్న రైతుల గురించి షర్మిల ప్రస్తావిస్తూ.. ‘‘పత్తి రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. పత్తికి గిట్టుబాటు ధరలేక అప్పుల పాలైనామని రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. పసుపు, వరి, వేరుశనగ, మిరప పండించే ప్రతి రైతు పరిస్థితి కూడా ఇలానే ఉంది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు నాయుడు ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయకుండా పాదయాత్రలంటూ పల్లెల వెంట తిరుగుతూ నాటకాలు ఆడుతున్నారు. ఆయనకు తగినంత మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఈ అసమర్థ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టవయ్యా చంద్రబాబునాయుడూ అంటే.. పెట్టను గాక పెట్టను అంటారు. పైగా ఇప్పుడు అవసరం వస్తే అవిశ్వాసం పెడతానని కొత్త నాటకం ఆడుతున్నారు. ప్రజలకు అవసరం వచ్చినప్పుడు కాదండీ ఆయనకు అవసరం వచ్చినప్పుడు అవిశ్వాసం పెడతారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యేల బలం సరిచూసుకొని, చంద్రబాబు నాయుడు ఇక ఇప్పుడు అవిశ్వాసం నాటకమాడు అని పచ్చజెండా ఊపితే అప్పుడు చంద్రబాబు అవిశ్వాసం పెడతారు’’ అని విమర్శించారు.

నల్లగొండ జిల్లాలో సాగుతున్న షర్మిల పాదయాత్ర ఆదివారం మర్రిగూడెం నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి గునగల్ క్రాస్ రోడ్డు, సరంపేట, గర్శగడ్డ, పాకగూడెం గ్రామాల మీదుగా లెంకలపల్లికి చేరింది. ఇక్కడ నీటిశుద్ధి కేంద్రాన్ని షర్మిల ప్రారంభించారు. అదే గ్రామ శివారులోఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 7.30 గంటలకు చేరుకున్నారు. మొత్తం 15.1 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. ఇప్పటి వరకు మొత్తం 897.2 కిలోమీటర్ల యాత్ర పూర్తయింది. ఎమ్మెల్యే అమర్ నాథ్‌రెడ్డి, నేతలు ఎంవీ మైసూరారెడ్డి, కేకే మహేందర్, జిట్టా బాలకృష్ణారెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, సంకినేని వెంకటేశ్వరరావు, బీరవోలు సోమిరెడ్డి, తలశిల రఘురాం, వాసిరెడ్డి పద్మ తదితరులు యాత్రలో పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...