Thursday, February 14, 2013

మోటార్లు పీక్కుపోతున్నారు


* రైతులకు రూ. వేలల్లో వస్తున్న కరెంటు బిల్లులు
* పోలీసు స్టేషన్లలో నిలబెట్టి బిల్లు వసూళ్లు..
* కట్టకపోతే మోటార్లు, స్టార్టర్లు తీసుకుపోతున్న అధికారులు
* కరెంటు కొరత, వర్షాభావంతో వేల ఎకరాల్లో బత్తాయి తోటలు నరికేసిన రైతులు
* లక్షల ఎకరాల్లో బీడుకు వదిలేసిన ఇతర పంటల రైతులు
* నల్లగొండ జిల్లాలో దుస్థితి.. షర్మిల పాదయాత్రతో వెలుగులోకి
* ప్రభుత్వ దాష్టీకంపై నిప్పులు చెరిగిన షర్మిల
* ప్రజలను క్షోభకు గురిచేస్తున్న ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టమంటే
* చంద్రబాబు డ్రామాలాడుతున్నారని ధ్వజం 

 కరెంటు రాదు.. వచ్చిన రెండు మూడు గంటలకే రూ.వేలకు వేల బిల్లు.. ఇదేమని అడిగితే అధికారులు స్పందించరు.. బిల్లు కట్టకుంటే పోలీసు స్టేషన్‌కు ఈడ్చి మెడ మీద లాఠీపెట్టి మరీ వసూలు చేస్తున్నారు. లేదంటే అధికారులు రాత్రివేళ బోరు బావుల వద్దకొచ్చి కరెంటు మోటార్లు, స్టార్టర్లు తీసుకుపోతున్నారు. ఇంటి కనెక్షన్లు కట్ చేస్తున్నారు. అటు పంటకు నీళ్లు అందక.. ఇటు మోటార్లు లేక ఎండిపోతున్న పంటను చూడలేక.. రైతాంగం పెంచిన చేతులతోనే తోటలను తెగనరికివేస్తోంది.

పంట పొలాలను బీడు భూములుగా వదిలేస్తోంది. ఒక్క నల్లగొండ జిల్లాలోనే ఇలా 25 వేల ఎకరాల బత్తాయి తోటను రైతులు నరికి వేశారు. మరో 25 ఎకరాల్లో తోట నీళ్లు లేక ఎండిపోయింది. ఇతర పంటలు పండే మరో మూడు లక్షల ఎకరాలను బీడుకొదిలేసి.. రైతులు పిల్లాపాపలతో వలస వెళ్లిపోయారు. పాలకుల నిర్లక్ష్యం, ట్రాన్స్‌కో దాష్టీకంతో విలవిల్లాడుతున్న నల్లగొండ రైతన్న దుస్థితి.. షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్రతో వెలుగులోకొచ్చింది.

ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో కుమ్మక్కయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున సోదరి షర్మిల చేపట్టిన పాదయాత్ర 65వ రోజు బుధవారం నల్లగొండ, నాగార్జున సాగర్ నియోజకవర్గాల్లో సాగింది.

ఈ సందర్భంగా అమ్మగూడెం గ్రామంలో ఒక చోట బత్తాయి తోట కాల్చివేసి ఉండడం గమనించిన షర్మిల పొలంగట్టు మీద నుంచి నడుచుకుంటూ అక్కడికి వెళ్లారు. కొండ చిన వెంకటేశం అనే రైతు నీళ్లు లేక ఆ బత్తాయి తోటను తెగనరికి కాల్చివేశాడని తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆ నరికివేసిన బత్తాయి తోటను పరిశీలించారు. అక్కడే ఉన్న రైతులతో మాట్లాడారు. ‘‘అమ్మా.. మూడెకరాల్లో 340 బత్తాయి చెట్లు పెట్టిన. తొమ్మిదేళ్లుగా పెంచినా. నిరుడు, ముందటేడు నుంచి కాపుకొచ్చింది. కాపుకొచ్చిన సమయానికి వానలు లేవు... కరెంటు లేదు.. కాయ సైజు తగ్గింది.. దిగుబడిపోయింది. ఈ ఏడాదైతే మొత్తమే ఎండిపోయింది. ఎండిపోయిన తోట ఎందుకని నరికేసిన’’ అని గోగు పెద యాదయ్య కన్నీళ్లు పెట్టాడు.

రూ.10 వేల బిల్లొచ్చింది..
మరో రైతు గోగు కొమరయ్య షర్మిలతో మాట్లాడుతూ.. ‘‘రూ. 10 వేల కరెంటు బిలొచ్చిందమ్మా.. కట్టమని ఒత్తిడి చేశారు. అంత బిల్లు ఎందుకొచ్చింది అని అడిగినా ఎవ్వరూ పలకలేదు. బిల్లు కట్టలేదు.. రాత్రికి రాత్రే వచ్చి నా మోటారు, స్టాటరు పీక్కపోయిండ్రు. తెల్లారి తోటకు పోతే మోటారు, స్టాటర్ లేదు. దొంగలు తీసుకొని పోయినారు అనుకున్నా.. పొలం ఎండిపోయింది. మూడు రోజులకు కరెంటు సారోళ్లొచ్చి మోటారు, స్టాటర్ మేం తీసుకొని పోయినాం అని చెప్పారు. కడుపు రగిలిపోయిందమ్మా... పొట్టకొచ్చిన సేను ఎండిపోయింది. వీళ్లు మనుషులా అమ్మా’’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. ‘‘రెంటు బిల్లు కట్టకపోతే తట్టి చెంబులు, బువ్వసర్వలు, పక్కబట్టలు జప్తు చేస్తామని కరెంటు సారోళ్లు చెప్పారు. పోలీస్ స్టేషన్‌కు తీసుకొని పోయి నిలబెట్టారు. మర్నాడు ఫైనాన్స్‌ల రూ.3 వడ్డీ కింద అప్పుతీసుకొని కరెంటు బిల్లు కట్టిన’ అని మరో రైతు పర్వతాలు చెప్పడంతో షర్మిల విస్మయానికి గురయ్యారు.

మళ్లీ చంద్రబాబు పాలనా!!
రైతుల బాధలు విన్నాక షర్మిల స్పందిస్తూ.. రాష్ట్రంలో మళ్లీ చంద్రబాబు పాలన కనిపిస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘చంద్రబాబు తన హయాంలో కరెంటు బిల్లులు వసూలు చేయించడానికి రైతులను తీసుకొని పోయి జైళ్లలో పెట్టారు. ఇంట్లో మగవాళ్లు లేకుంటే ఆడవాళ్లను స్టేషన్లకు తీసుకొనిపోయి నిలబెట్టారు. ఈ అవమానం భరించలేక దాదాపు 4 వేల మంది రైతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డి పరిపాలన అచ్చం చంద్రబాబు పాలననే తలపిస్తోంది. 

ఇది చంద్రబాబు పరిపాలన రెండో భాగం. తొమ్మిదేళ్ల పరిపాలనలో ప్రజలను ఎన్ని రకాలుగా హింసించాలో అన్ని రకాలుగా హింసించారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రం కుదేలయిపోయింది. వీళ్లకు పోయేకాలం దగ్గరకొచ్చింది. రైతుల ఉసురుతాకి పోతారు. రైతన్నలకు ఒక్క మాట చెప్తున్నాను. మళ్లీ మంచి రోజులు వస్తాయి. జగనన్న త్వరలోనే బయటకు వస్తారు. రైతును రాజుగా చూసుకుంటారు. రాజన్న ఇచ్చిన ఉచిత విద్యుత్తును కొనసాగిస్తారు. అప్పుల నుంచి మీకు విముక్తి కలిగిస్తారు. వడ్డీ లేని రుణాలు అందిస్తారు. అంత వరకు మీరు ఓపిక పట్టండి. దయచేసి ఏ ఒక్కరు కూడా విలువైన మీ భూములను, అంతకంటే విలువైన మీ ప్రాణాలను తీసుకోవద్దన్నా’ అని వారిని కోరారు.

ఢిల్లీ చుట్టూ తిరగడానికే సరిపోతోంది..
‘‘చంద్రబాబు నాయుడుది పదవీ వ్యామోహం. ఆయన ఏ పని చేసినా రాజకీయంగానే ఆలోచన చేస్తారు. కుర్చీ కోసం పిల్లనిచ్చిన సొంత మామనే వెన్నుపొడిచిన ఘనుడు ఆయన. వైఎస్సార్ వచ్చాక రాష్ట్రాన్ని మళ్లీ ప్రగతి బాట పట్టించారు. పాలించే రాజు మంచివాడైతే.. దేవుని దయకూడా ఉంటుంది. వర్షాలు సకాలంలో పడుతాయి. పంటలు పండుతాయి. వైఎస్సార్ సువర్ణపాలనలో వర్షాలకు కొదవలేదు.. పంటలు బాగా పండాయి. 

ఆయన మన మధ్య నుంచి వెళ్లిపోయిన తరువాత మన రాష్ట్రాన్ని ఈ పాలకులు నాశనం చేస్తున్నారు. చంద్రబాబు పాలనలో ప్రజలు ఏవిధంగానైతే కష్టాలు కన్నీళ్లు పెట్టారో ఇప్పుడు రాష్ట్రంలో మళ్లీ అలాంటి పరిస్థితులే వచ్చాయి. ఈ పాలకులకు రైతన్న గోడు పట్టడం లేదు. వీళ్లు పదవులు కాపాడుకోవడానికి ఢిల్లీ చుట్టూ తిరిగడమే సరిపోతోంది. ప్రజలను పట్టించుకోని ఈ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టి దించేయవయ్యా చంద్రబాబూ అంటే.. ఆయన కుంటిసాకులు చెప్తున్నారు. తనపై ఉన్న అవినీతి ఆరోపణల మీద దర్యాప్తులు జరగకుండా ఉండడం కోసం అవిశ్వాసం పెట్టకుండా పాదయాత్ర అంటూ డ్రామాలు ఆడుతున్నారు’’ అని షర్మిల నిప్పులు చెరిగారు.

బుధవారం పాదయాత్ర అమ్మగూడెం గ్రామం నుంచి ప్రారంభమైంది. గౌరారం, మారెపల్లి, అన్నారం క్రాస్ రోడ్డు, యాచారం గ్రామాల మీదుగా రామడుగు గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 7.30 గంటలకు షర్మిల చేరుకున్నారు. బుధవారం 15.8 కిలోమీటర్లు ప్రయాణించారు. ఇప్పటివరకు మొత్తం 943.1 కిలోమీటర్ల యాత్ర పూర్తయింది. వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు కేకే మహేందర్‌రెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి, సంకినేని వెంకటేశ్వరరావు, బీరవోలు సోమిరెడ్డి, పాదూరి కరుణ, తలశిల రఘురాం, జ్యోతుల నవీన్, డాక్టర్ హరికృష్ణ, స్థానిక నాయకులు అల్గుబెల్లి రవీందర్‌రెడ్డి, ఇరుగు సునీల్‌కుమార్, అంజయ్య చౌదరి, మల్లు రవీందర్ రెడ్డి తదితరులు యాత్రలో పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...