Tuesday, February 12, 2013

దమ్మున్న లీడర్‌ని దూరం చేసుకున్నారు


మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అంటారు. అదే స్ఫూర్తితో ఆంధ్రరాష్ట్ర ప్రజలు వైయస్సార్ దేవోభవ అని కూడా చేర్చి తమ హృదయాల్లో ఆ మహనీయుడిని నింపుకున్నారు. జవజీవాలు కోల్పోయి, జీవచ్ఛవంలా మారి కనుమరుగైన కాంగ్రెస్‌కు ఆశాజనకమైన నాయకత్వం కనుచూపు మేరలో కనిపించని సమయంలో ‘నేనున్నాను’ అంటూ మండుటెండలను సైతం లెక్కచేయకుండా 1600 కి.మీ పాదయాత్ర చేసి, ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఆ పార్టీని తిరిగి 2004లో అధికారంలోకి తెచ్చిన ఘనత ఒక్క వైయస్ రాజశేఖరరెడ్డిగారికే దక్కుతుంది. 

అయితే నేడు ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులందరు కలిసి ఏనాడు ఇంటిగుమ్మం కూడా దాటని వైయస్సార్ కుటుంబంలోని ఆడపడుచులను నడిరోడ్డుపై కన్నీరు పెట్టుకునేలా చేశారు! ఈ దారుణానికి చరమగీతం పాడటానికి జనం ఎదురు చూస్తున్నారు. 
సీబీఐ అంటే నిష్పక్షపాతంగా ఉండాలి. కాని అది కాంగ్రెస్ పార్టీకి కీలుబొమ్మలా మారిందన్న సంగతి ప్రజలందరికి స్పష్టంగా కనిపిస్తోంది. జగన్ బెయిలు పిటిషన్ కోర్టులో విచారణకు వచ్చినప్పుడు సీబీఐ తరపున వాదిస్తున్న లాయర్లు జగన్ ఒక ఎమ్.పి అనీ, ఒక పార్టీకి అధ్యక్షుడనీ, ఆయనకు గనుక బెయిలు ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తాడని అనడం సిగ్గుచేటు. 

జగనన్న ఎంపీగా, ఒకపార్టీ అధ్యక్షుడుగా ఉన్నంతకాలం ఆయనకు బెయిలు ఇవ్వరా? అని మేము అడుగుతున్నాము. జగనన్న ఏనాడైనా తను సి.ఎమ్ కావాలని కానీ, మంత్రి కావాలని కాని అడిగాడా? ఆయన అడిగిందల్లా ఒక్కటే... మా నాన్న మరణవార్త విని తట్టుకోలేక చనిపోయినవారి కుటుంబాలను ఓదార్చడానికి పర్మిషన్ ఇమ్మని! కానీ సోనియా ఏం చేశారు? ఓదార్పు యాత్రకు పర్మిషన్ ఇవ్వకపోగా చెయ్యని తప్పులకు జగనన్నను జైలు పాలు చేశారు.

అమ్మా! సోనియా... నీ కొడుకు రాహుల్‌ని ప్రధానమంత్రిగా చూడాలని కలలుకన్న మహనీయుడు రాజశేఖరరెడ్డిగారు. కాని నువ్వు రాజశేఖరరెడ్డిగారి తనయుడు జగనన్నని జైలుపాలు చెయ్యాలని అనుకున్నావు! అదేనా నీ సంస్కృతి, నీ సాంప్రదాయం! 2009 ఎలక్షన్ ప్రచారంలో - కాంగ్రెస్ పార్టీ నాయకులను పంచలు ఊడదీసి కొడతామన్న ప్రజారాజ్యంపార్టీ నాయకులు నీకు దగ్గర అయ్యారు కాని, సొంతపార్టీ మనిషైన జగనన్నను మాత్రం దగ్గరకు తీసుకోలేకపోగా, జైలులో పెట్టించావు. 2012 ఉపఎన్నికలలో తమకు అండగా నిలిచిన ఎమ్మెల్యేలకు మద్దతుగా బయటికి వచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయమ్మ వాహనాన్ని నడిరోడ్డుపై ఆపించి, సూట్‌కేసులు తనిఖీ చేయించావు. 

నీవు ఎప్పటికైనా నిజాలు తెలుసుకుని ఇలాంటి రాజకీయాల నుంచి బయటపడి నీ కుమారుని భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవాలంటే జగనన్నలాంటి ప్రజానాయకులను పక్కన ఉంచుకోవాలే కాని దూరం చేసుకోకూడదు. ఇప్పటికైనా కళ్లు తెరచి ప్రజల భావాలను అర్థం చేసుకుని, జగనన్నని వేధించడం ఆపించాలి. లేకుంటే తగిన మూల్యం చెల్లించక తప్పదు. జగనన్న జైలులో ఉన్నా, ఆయన వదిలిన బాణంలా... ఏ ఒక్క మహిళకు సాధ్యంకాని విధంగా సుమారు మూడు వేల కి.మీ పాదయాత్ర చేస్తున్న షర్మిలమ్మకు జనం నీరాజనం పలుకుతున్నారు. ఇది మహిళాకీర్తికే నిదర్శనం. భర్తను పోగొట్టుకుని, ఒక బిడ్డను జైల్లో, మరో బిడ్డను రోడ్డు మీద చూసుకుంటూ ఆ తల్లి విజయమ్మ పడుతున్న వేదన ఏ తల్లికీ రాకూడదని ఆ దేవుణ్ణి మనస్పూర్తిగా ప్రార్థిస్తున్నాము. 
- పి.వెంకటేష్, పి.దామోదర్‌రెడ్డి, హసనాపురం, నెల్లూరు జిల్లా

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...